ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కారు.. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ మింగేయాలని చూస్తున్నది. ఇప్పటికే బ్యాంకులను విలీనం చేస్తూపోతున్న కేంద్రం.. వాటి సంఖ్యను గణనీయంగానే తగ్గిస్తున్నది. కొన్ని బ్యాంకుల్లోనైతే వాటాలనూ విక్రయిస్తూ ముందుకెళ్తున్నది. ఈ క్రమంలో ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేట్పరం చేయాలన్న యోచనలో ఉన్నది. ఇందుకోసం ప్రస్తుత బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970లో సవరణలను తీసుకొచ్చే పనిలో నిమగ్నమైంది.
న్యూఢిల్లీ, జూలై 13: ప్రభుత్వ రంగ బ్యాంకులు కనుమరుగవబోతున్నాయా? దేశీయ బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లబోతున్నదా?.. అంటే అవుననే సమాధానమే వస్తున్నది. త్వరలో దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రైవేట్పరం కాబోతున్నాయి మరి. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగానే పావులు కదుపుతున్నది. బ్యా ంకింగ్ చట్టంలో సవరణలను తీసుకువచ్చేందుకు గట్టిగా ప్ర యత్నిస్తున్నది. అన్ని రంగాల్లో ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరిస్తున్న మోదీ సర్కారు.. ఇటీవలే ఎయిర్ ఇండియానూ టాటాలకు అమ్మేసిన విషయం తెలిసిందే. ఎల్ఐసీలోనూ 3.5 శాతం వాటాను అమ్ముకున్న సంగతి విదితమే. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు ప్రభు త్వ బ్యాంకులను పూర్తిగా కట్టబెట్టే పనిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది.
చట్టాలకు సవరణలు
కుదిరితే నేరుగా.. కుదరకపోతే చట్టాలను మార్చేసిమరీ కేంద్రం తన పంతం నెగ్గించుకుంటున్నది. ఇప్పుడు ప్రజా ప్రయోజనాలను, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వర్గాలను పక్కకుపెట్టి కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థనే మాయం చేయాలని చూస్తున్నది. అధికారంలో ఉన్నాం కదా అని చట్టాలనూ మార్చేందుకు తెగిస్తున్నది. ప్రభుత్వ బ్యాంకులను 100 శాతం అమ్మేందుకు వీలుగా బ్యాంకింగ్ కంపెనీల చట్టం 1970లో సవరణలు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే మార్చిన బ్యాంకింగ్ చట్టం బిల్లును ప్రవేశపెట్టే వీలూ లేకపోలేదు. ఇదే కనుక జరిగితే ప్రభుత్వ బ్యాంకులు దూరమైనట్టే. ప్రస్తుతం ప్రభుత్వ బ్యాంకుల్లో సర్కారు వాటా 51 శాతానికి తగ్గరాదు. అయితే దీన్ని 26 శాతానికి తగ్గించాలని మోదీ సర్కారు అనుకున్నది. కానీ ఏకంగా చట్టాన్నే మార్చేసి బ్యాంకులను పూర్తిగా అమ్ముకోవాలని ప్రయత్నిస్తున్నదిప్పుడు.
ముందుగా ఐవోబీ, సెంట్రల్ బ్యాంక్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐవోబీ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సీబీఐ)లను తొలుత ప్రైవేట్పరం చేయాలని కేంద్రం యోచిస్తున్నది. గత కేంద్ర బడ్జెట్లోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను స్పష్టంగా పేర్కొన్న విషయం తెలిసిందే. బ్యాంకింగ్ చట్టంలో సవరణలు తెస్తే ఐవోబీ, సెంట్రల్ బ్యాంక్లు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినట్టేనంటున్నారు. అలాగే ఇప్పటికే ఐడీబీఐ బ్యాంక్లో వాటాను అమ్ముకున్న కేంద్రం.. మిగతా వాటానూ వదిలించుకోవాలనుకుంటున్నది. మరోవైపు బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తోనూ ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతున్నది.
ఎస్బీఐ మినహా అన్నీ ప్రైవేటే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మినహా మిగతా ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్పరం చేయాలని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఐప్లెడ్ ఎకనామిక్ రిసెర్చ్ (ఎన్సీఏఈఆర్) డైరెక్టర్ జనరల్ పూనమ్ గుప్తా, ఆర్థికవేత్త అర్వింద్ పనగరియాలు అంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఎన్సీఏఈఆర్ ‘ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ ఇండియా వై, హౌ అండ్ హౌ ఫార్?’ అనే పేరుతో ఓ నివేదికను సిద్ధం చేసింది. అయితే ప్రధాన మంత్రికి ఆర్థిక సలహాదారు మండలిలో గుప్తా కూడా సభ్యుడు కావడం గమనార్హం. ‘ఎస్బీఐ సహా దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలని మేము ప్రతిపాదించాం. అయితే దేశ ఆర్థిక, రాజకీయ వ్యవస్థల దృష్ట్యా కనీసం ఒక్క ప్రభుత్వ రంగ బ్యాంకైనా ఉండాల్సిన అవసరం ఉన్నదని భావించాం. అందుకే ఇప్పటికైతే ఎస్బీఐ మినహా అన్ని బ్యాంకులను ప్రైవేట్పరం చేసుకోవచ్చని చెప్పాం’ అన్నారు. ప్రస్తుతం దేశంలో ఎస్బీఐ సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. ఒకప్పుడు 30 వరకున్నది తెలిసిందే.
బడుగు, బలహీన వర్గాలకు దెబ్బే
ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ లక్షలాది మంది ఉద్యోగుల్ని రోడ్డునపడేసేలా ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దాదాపు 8.26 లక్షలుగా ఉన్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులవారే ఎక్కువ. ప్రభుత్వ విధానాలను అనుసరించి రిజర్వేషన్ల కోటాలో మెజారిటీ ఉద్యోగులకు కొలువులు దక్కాయి. ఇప్పుడు బ్యాంకులు ప్రైవేట్పరమైతే వీరి ఉద్యోగాలకు గ్యారంటీ ఉండదన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పీపుల్స్ కమిషన్ ఆన్ పబ్లిక్ సెక్టార్ అండ్ సర్వీసెస్ విడుదల చేసిన వివరాలూ ఇదే చెప్తున్నాయి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సమాజంలోని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికే దెబ్బని మేధావులూ అంటున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఉద్యోగార్థులకు ఒక్క బ్యాంక్ను ప్రైవేటీకరించినా ఆ నష్టం తీవ్రంగానే ఉంటుందని చెప్తున్నారు. మొత్తానికి కొత్తగా ఉపాధి కల్పన దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాల్ని మాత్రం ఈ ప్రభుత్వం ఊడగొడుతున్నదంటున్నారంతా.