న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఉల్లిగడ్డ ధరలు పెరగకుండా నిరోధించేందుకు, దేశీయ మార్కెట్లో ఉల్లి సరఫరాను పెంచేందుకు ఈ ఎగుమతి సుంకం నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
సెప్టెంబర్ నెలలో ఉల్లిగడ్డల ధరలు పెరిగే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో.. ఎగుమతులను తగ్గించి, దేశీయ మార్కెట్లలో సరఫరాను పెంచి ధరల పెరుగుదలకు కళ్లెం వేయడం కోసం ఎగుమతి సుంకం పెంచింది. అయితే, దేశీయంగా ఉల్లిగడ్డ లభ్యతను పెంచడం కోసం బఫర్ స్టాక్ నుంచి మూడు లక్షల టన్నులను రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన కేంద్రం.. ఇప్పటివరకైతే స్టాక్ను రిలీజ్ చేయలేదు.