న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: విదేశాల్లో ఉంటున్న భారత పౌరులు ఎలక్ట్రానిక్ పోస్టల్ బ్యాలెట్(ఈటీపీబీఎస్) ద్వారా ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాలు పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర తెలిపారు. దక్షిణాఫ్రికా, మారిషస్ దేశాల పర్యటనలో ఉన్న ఆయన అక్కడి భారత పౌరులను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడారు.
ఎన్ఆర్ఐ రిజిస్టర్డ్ ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఓవర్సీస్ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈటీపీబీఎస్ సౌకర్యం కల్పించాలని ఈసీ 2020లోనే ప్రతిపాదించింది. ప్రస్తుతం ఇది కేవలం సర్వీస్ ఓటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.