LPG Allocation : కమర్షియల్ గ్యాస్ కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కమర్షియల్ లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) లో అదనంగా 20 శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న ఎల్పీజీ కేటాయింపుల్లో ఇప్పటి కేటాయింపులు 50 శాతానికి చేరినట్లయ్యిందని కేంద్రం పేర్కొన్నది. అయితే వీటిలో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, పారిశ్రామిక క్యాంటీన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కమ్యూనిటీ కిచెన్లు, సబ్సిడీల్లో ఆహారం అందించే కేంద్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
చమురు కంపెనీల వద్ద రిజిస్టరైన వాణిజ్య సంస్థలతోపాటు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వాటికే ఈ అదనపు కేటాయింపు వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. మార్చి 23 నుంచి ఈ అదనపు కేటాయింపులు సరఫరా చేస్తామని తెలిపింది. దీంతోపాటు వలస కూలీలకు ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లు అందజేయాలని సూచించింది. సిలిండర్లు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పెట్రోలియంశాఖ కార్యదర్శి లేఖలు రాశారు.