చెన్నై: ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం అమలు చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హెచ్చరించారు. ఈ మేరకు శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను అధికారంలోకి తెచ్చిన స్టాలిన్ సీఎం అయ్యాక పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా రోగులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఇటీవల ప్రకటించారు.
కాగా, కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఆక్సిజన్ సిలిండర్లు, కరోనా రోగులకు అత్యసవర సమయాల్లో ఇచ్చే యాంటీ వైరల్ ఇంజెక్షన్ రెమ్డెసివర్తో పాటు ఇతర ఔషధాలకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొందరు అక్రమార్కులు రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లను బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ వీటిపై దృష్టి సారించారు. ఆక్సిజన్ సిలిండర్లు, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అక్రమంగా నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్మేవారిపై గూండా చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.