న్యూఢిల్లీ, డిసెంబర్ 19: మహిళలు ప్రారంభించే స్టార్టప్లకు మద్దతు అందించేందుకు 75 మిలియన్ డాలర్ల నిధులు అందించనున్నట్టు ప్రసిద్ధ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రకటించింది. అందరికీ ఇంటర్నెట్ సేవలు చౌకగా లభ్యమయ్యే దిశగా పదేండ్లలో పెట్టుబడి పెట్టేందుకు గూగుల్ ప్రారంభించిన 10 బిలియన్ డాలర్ల ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) ద్వారా మహిళలు ప్రారంభించే స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సోమవారం భారత్ పర్యటనను ప్రారంభించిన పిచాయ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్లను కలిశారు. అటు తర్వాత గూగుల్ ఫర్ ఇండియా 2022 సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో మాట్లాడుతూ చిన్న వ్యాపారాలకు, స్టార్టప్లకు గూగుల్ మద్దతుగా నిలుస్తుందని, 300 మిలియన్ డాలర్లు స్టార్టప్ల్లో ఇన్వెస్ట్ చేస్తామని, అందులో నాలుగోవంతు 75 మిలియన్ డాలర్లు మహిళా స్టార్టప్లో పెట్టుబడి పెడతామన్నారు. భారత్ స్టార్టప్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పారు.
100 భారత భాషల్లో సెర్చింగ్
టెక్ట్స్, వాయిస్ ఇంటర్నెట్ సెర్చ్ 100 భారతీయ భాషల్లో లభించే ప్రయత్నాన్ని గూగుల్ చేస్తున్నదని పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 773 జిల్లాల నుంచి స్పీచ్ డాటా సేకరించేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్తో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ఐఐటీ మద్రాస్లో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సెంటర్ ఏర్పాటుకు 1 మిలియన్ డాలర్ల గ్రాంట్ను ప్రకటించింది. తమ 10 బిలియన్ డాలర్ల ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ ప్రగతిని చూసేందుకు తాను భారత్ వచ్చానని గూగుల్ సీఈవో తెలిపారు. గూగుల్ ఐడీఎఫ్ ద్వారా జియోలో 7.73 శాతం వాటాను 4.5 బిలియన్ డాలర్లకు, భారతి ఎయిర్టెల్లో 1.2 శాతం వాటాను 700 మిలియన్ డాలర్లకు కంపెనీ ఇంతకుముందే కొనుగోలు చేసింది.