Gold Smuggling | ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపాన అక్రమంగా తరలిస్తున్న రూ.2 కోట్లపై చిలుకు విలువ గల బంగారాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) టీం పట్టుకుంది. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితులు మయన్మార్ నుంచి బంగారం బిస్కట్లు తరలిస్తున్నారని డీఆర్ఐ అధికారుల కథనం. మయన్మార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఆదివారం బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి తరలిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని డీఆర్ఐ అధికారులు చెప్పారు.
వేగుల నుంచి అందిన సమాచారం మేరకు డీఆర్ఐ వారణాసి యూనిట్ అధికారుల బృందం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ స్టేషన్లో బ్రహ్మపుత్ర ఎక్స్ప్రెస్ రైలులో ఎక్కారు. అటుపై బోగీల వారీగా తనిఖీలు చేపట్టారు. హెచ్-1 బోగీలో ప్రయాణిస్తున్న అరవింద్ (51) అనే మహారాష్ట్ర వాసి, అమిత్ అనే తమిళనాడు నివాసిని తనిఖీ చేయగా, వారి వద్ద 20 బంగారం బిస్కట్లు పెట్టిన పెట్టె దొరికింది. ఆ బంగారం బిస్కట్ల విలువ రూ.2.07 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పర్చగా జైలుకు పంపారన్నారు.