GoFirst flight | బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఓ గమ్మత్తు జరిగింది. ప్రయాణికులు బస్సులోనే వేచి ఉండగా.. విమానం మాత్రంలో గాలిలో ఎగిరిపోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు అరే బాబూ ఆపండిరా విమానాన్ని అని అరుస్తున్న పట్టించుకునే నాథుడు లేకపోయాడు. ప్రయాణికులు ఆందోళనకు దిగడంతో 4 గంటల తర్వాత మరో విమానం అరెంజ్ చేశారు. దీనిపై డీజీసీఏ నివేదిక కోరినట్లు తెలుస్తున్నది. మరో గమ్మత్తైన విషయం ఏంటంటే.. విమానం గాలిలో ఎగిరిపోయిన విషయం గ్రౌండ్ సిబ్బందికి కూడా తెలియదంట.
సోమవారం తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లేందుకు గోఫస్ట్ ఫ్లైట్ జీ8 116 విమానం సిద్ధమైంది. రెండు బస్సల్లో వచ్చిన ప్రయాణికులు విమానంలోకి ఎక్కి తమతమ సీట్లలో కూర్చున్నారు. మూడు, నాలుగు బస్సలు మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుతాయనగా.. విమానం గాల్లోకి ఎగిరింది. దాంతో బస్సుల్లో వస్తున్న 54 మంది ప్రయాణికులు అవాక్కయ్యారు. తాము లేకుండానే ఎలా విమానాన్ని ఎగరనిస్తారని వారు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. దాంతో గోఫస్ట్ ఎయిర్వేస్ అధికారులు 4 గంటల అనంతరం మరో విమానాన్ని తెప్పించి వారిని గమ్యస్థానం చేర్చారు.
ఇలాఉండగా, విమానం గాల్లోకి ఎగిరే విషయం గ్రౌండ్ సిబ్బందికి కూడా తెలియదంట. విమానం ఎక్కకుండానే తిరిగి ఎయిర్పోర్టుకు తిరిగి వచ్చిన ప్రయాణికుల బోర్డింగ్ పాస్లు చూసి విమానాశ్రయం అధికారులు అవాక్కయ్యారు. విమానం మిస్సయిన ప్రయాణికుల బ్యాగేజీని వెనక్కి తెప్పించిన అధికారులు.. తిరిగి 10 గంటలకు 54 మందిని మరో విమానంలో ఢిల్లీకి పంపించారు. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న డీజీసీఏ.. నివేదిక అందజేయాలని ఎయిర్పోర్ట్ అధికారులను ఆదేశించింది. నివేదిక ఆధారంగా కారకులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ ఘటనపై వ్యాఖ్యానించేందుకు గోఫస్ట్ అధికారులు నిరాకరించారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ట్వీట్ ద్వారా సంస్థ తెలిపింది.