పనాజీ : వచ్చే ఏడాది గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటి నుంచి పలు పార్టీలు ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సైతం బరిలో దిగుతున్నది. ఈ క్రమంలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
గోవాలో నిర్వహించిన సభలో ఆప్ పార్టీని గెలిపిస్తే రాష్ట్ర ప్రజలకు ఉచితంగా ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్.. ఢిల్లీ సీఎంపై విమర్శలు గుప్పించారు. ఉచిత తీర్థయాత్ర తన ప్రణాళిక అన్న ఆయన.. బడ్జెట్లో పథకాన్ని (ఉచిత తీర్థయాత్ర) ప్రకటించానన్నారు. కేజ్రీవాల్ తన ప్లాన్ కాపీ చేస్తున్నాడని, అది ఆయనకు అలవాటేనని.. ఆయనో ‘కాపీ మాస్టర్’ అంటూ విమర్శించారు.