పనాజీ, జనవరి 22: గోవాలో బీజేపీకి మరో షాక్ తగిలింది. మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ ఇప్పటికే పార్టీకి గుడ్బై చెప్పగా.. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత లక్ష్మీకాంత్ పార్సేకర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద్కు పంపారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. ప్రస్తుతం పార్సేకర్ గోవా బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా, పార్టీ కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. అయినప్పటికీ బీజేపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. 2002-2017 మధ్యకాలంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన మాండ్రమ్ అసెంబ్లీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్యే దయానంద్ను బీజేపీ నామినేట్ చేసింది. దీంతో పార్సేకర్ పార్టీని వీడాలని నిర్ణయించుకొన్నారు. పార్సేకర్ 2014-17 మధ్యలో సీఎంగా ఉన్నారు. గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరుగనున్నాయి.
నాడు నాన్నను.. నేడు నన్ను: ఉత్పల్
గోవాలో బీజేపీ సంస్థాగతంగా రోజురోజుకూ దిగజారిపోతున్నదని ఉత్పల్ పారికర్ అన్నారు. వేరే పార్టీల నుంచి వచ్చినవారికి ఇచ్చిన ప్రాధాన్యం తొలి నుంచి బీజేపీలో ఉన్న కార్యకర్తలకు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో మరో పారికర్ రావొద్దన్న అక్కసుతోనే తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు. 1994లో కూడా తన తండ్రి మనోహర్ పారికర్ను పార్టీ నుంచి పంపేయాలని కొందరు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఆయనకు ప్రజల మద్దతు ఉండటంతో ఏమీ చేయలేకపోయారని చెప్పారు. నాడు మనోహర్ పారికర్ను పార్టీ నుంచి పంపేయాలని చూసినవాళ్లు ఇప్పుడు పార్టీలో పెద్ద పెద్ద హోదాలో ఉన్నారని ఉత్పల్ తెలిపారు. బీజేపీకి రాజీనామా చేయడంపై ఉత్పల్ శనివారం మాట్లాడారు. అది చాలా కఠినమైన నిర్ణయం అని అన్నారు. పనాజీలో మోన్సెరాటీకి బదులుగా మంచి అభ్యర్థిని నిలబెడితే, అక్కడ తాను పోటీ చేయబోనని, ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
60% మంది పార్టీ మారారు
గడిచిన ఐదేండ్లలో గోవాలో 60 శాతం ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇది ఇండియాలోనే రికార్డు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్(ఏడీఆర్) తెలిపింది. 40 మంది ఎమ్మెల్యేలున్న గోవాలో 24 మంది పార్టీ మారారు. ఇంత శాతం మంది పార్టీ మారడం ఇండియాలో ఎన్నడూ జరగలేదని ఏడీఆర్ వెల్లడించింది. ఒక్క 2019లోనే ప్రతిపక్ష నేత చంద్రకాంత్కావ్లేకర్ సహా 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
హక్కులు తర్వాత.. బాధ్యతలు విస్మరించొద్దు!
ఇన్నాళ్లూ ప్రజలు తమ హక్కుల గురించే మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో హక్కుల గురించి మాట్లాడటం కొంతవరకు సరైనదే కావొచ్చు. కానీ, బాధ్యతలను విస్మరించడం సరైంది కాదు. ఇది యావత్ జాతిని బలహీనపరుస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా బాధ్యతల నుంచి తప్పించుకోవడం అనే ఓ దురలవాటు మనలో, ఇప్పటికీ బలంగా వేళ్లూనుకొన్నది – ప్రధాని మోదీ
హక్కులు లేకుంటే ప్రజాస్వామ్య దేశానికి అర్థమేంటి?
పౌరులకు హక్కులు కల్పించలేని దేశం.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉండటంలో అర్థమేముంది? హక్కులను కాలరాయడానికి మోదీ సర్కారు మొదటి నుంచీ ప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలకు ఉపాధి పొందే హక్కు, సమాచార హక్కులను నిర్వీర్యం చేయడం గురించే మోదీ మాట్లాడుతున్నారా? సమాధానం ఇవ్వాలి.
– కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ