బెంగళూరు: పాకిస్థాన్ (Pakistan) వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అంటూ ఇద్దరు ముస్లిం విద్యార్థులపై ఓ టీచర్ ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటన కర్ణాటకలోని (Karnataka) ఉర్దూ మీడియం స్కూల్లో (Urdu school) చోటుచేసుకున్నది. శివమొగ్గలోని (Shivamogga) ఓ ఉర్దూ మీడియం స్కూల్లో ఓ మహిళా టీచర్ కన్నడ లాంగ్వేజ్ (Kannada Language teacher) బోధిస్తున్నది. ఐదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూమ్లో కొట్టుకుంటున్నారు. వారిని ఆ టీచర్ అడ్డుకున్నారు. అయితే ‘పాకిస్థాన్ వెళ్లిపోండి.. ఇది హిందువుల (Hindus) దేశం’ అని టీచర్ తమపై అరిచారంటూ విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో అధికారులు ఆమెను మరో స్కూల్కు బదిలీచేశారు. ఈ వ్యవహారంపై అంతర్గంతంగా విచారణ నిర్వహిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ అధికారి బీ నాగరాజు (B Nagraj) తెలిపారు. ఆమె గత ఎనిమిదేండ్లుగా అదే స్కూల్లో పనిచేస్తున్నారని, 26 ఏండ్ల అనుభవం ఉందని చెప్పారు.