దేశంలో ఎక్కువశాతం స్వయంగా వండివార్చిన సంప్రదాయ ఆహారానికే మొగ్గుచూపుతున్నారు. ప్రాసెసింగ్ ఫుడ్కు ఆదరణ చూపడంలేదు. తినేందుకు రెడీగా ఉండే (రెడీ టు ఈట్) ఆహారాన్ని పట్టించుకోవడం లేదు. గత 20 ఏండ్లలో దేశంలో ప్రాసెస్ అయిన వ్యవసాయఉత్పత్తుల గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): దేశంలో ఆహార ఉత్పత్తుల్లో ఎక్కువగా అసంఘటిత రంగంలోనే ప్రాథమిక ప్రాసెసింగ్ ద్వారా వినియోగిస్తున్నట్టు తేలింది. స్థానికంగా మిల్లుల్లో పట్టించుకోవడం ద్వారా సంప్రదాయ పద్ధతుల్లోనే తయారుచేసుకుని వినియోగిస్తున్నారు. నిల్వ ఉంచిన ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా ఇండ్లలో తాజాగా వండుకున్న ఆహారాన్ని తినేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఉపాధి, ఉత్పాదకత, పోటీతత్వంపై ఆగ్రా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ- ఇంటర్ సెక్టోరల్ లింకేజీ నిర్వహించిన ఓ ప్రైవేటు అధ్యయనంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికీ ఎక్కువశాతం మంది బియ్యం, గోధుమలతో తయారైన వంటలనే ఆహారంగా తీసుకుంటున్నారు. పెద్ద కార్పొరేట్ కంపెనీలు చిరుధాన్యాలు, ఇతర ఆహార ఉత్పత్తులను ప్రాసెస్ చేయడం ద్వారా తయారుచేసిన పదార్థాలను పరిమిత సంఖ్యలోనే వినియోగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి పెద్ద ఎత్తున సేకరిస్తున్న ఆహార ఉత్పత్తుల్లో ఐదుశాతం మాత్రమే ప్రాసెసింగ్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి.
ముడిసరుకుకు ఏదైనా వ్యాల్యూయాడ్ అయితేనే ప్రాసెస్డ్ ఫుడ్గా పరిగణిస్తారు. ఆహార ఉత్పత్తులను సహజంగా మూడుదశల్లో ప్రాసెస్ చేస్తారు. మొదటిదశలో ముడిసరుకును శుభ్రపర్చడం, గ్రేడింగ్ చేయడం, ప్రీకూలింగ్, ప్యాకేజింగ్ చేస్తారు. రిటైల్ మార్కెట్లో మొదటిదశ ప్రాసెస్ వస్తువులకే గిరాకీ ఉంటున్నది. ఇందులో కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, మసాలా దినుసులు తదితర వస్తువులున్నాయి. రెండోదశలో డ్రైయింగ్, మిల్లింగ్, గ్రైండింగ్ నిర్వహిస్తారు. వడ్లను బియ్యంగా, పప్పు ధాన్యాలను పప్పులుగా, గోధుమలను పిండిగా, చెరకును చక్కెరగా మారుస్తారు. ఇక్కడిదాకా వ్యవసాయ ఉత్పత్తులకు ఏ విధమైన వ్యాల్యూయాడ్ కాదు. పిండిని ప్రాసెస్ చేయడంద్వారా బ్రెడ్, నూడుల్స్, ఓట్స్, బిస్కెట్స్, పాస్తా, క్యాచప్స్, జ్యూస్ తదితర పదార్థాలను తయారుచేయడం మూడోదశ. కార్పొరేట్ సంస్థలు వీటిని మరింతగా ప్రాసెస్ చేసి రెడీ టు ఈట్గా తయారుచేస్తారు. పాలు, చీజ్, బటర్, పాలతో తయారు చేసిన వస్తువులు ఈ కోవలేకే వస్తాయి.
వరి, గోధుమ వంటి ఉత్పత్తులు అసంఘటితరంగంలోనే ఎక్కువగా ప్రాథమిక ప్రాసెసింగ్ జరుగుతున్నది. బియ్యం, గోధుమ పిండి, మొక్కజొన్నతో వివిధ రకాల పదార్థాలను ఇండ్లలోనే చేసుకుంటున్నారు. ఇందులో వ్యాల్యూయాడ్ కానందున ఈ తరహా ప్రక్రియను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పరిగణనలోకి తీసుకోరు. 2011-12లో మొత్తం ఆహార ఉత్పత్తుల్లో వ్యవస్థీకృత రంగంలో ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ కమాడిడీస్ (ఈపీఏ) కేవలం 14.14 శాతం మాత్రమే ఉన్నాయి. అందులో వరి 34.7, గోధుమలు 18.4, మొక్కజొన్న 43, పండ్లు, కూరగాయలు 2.65 శాతం ఉన్నాయి. కాఫీ, ఆయిల్సీడ్స్ మాత్రం 100 శాతం ప్రాసెస్ అవుతున్నాయి.