నేడు కూడా సర్వే కొనసాగింపు
వారణాసి, మే 15: స్థానిక కోర్టు ఆదేశాల నేపథ్యంలో వారణాసిలోని జ్ఞాన్వాపీ మసీదు కాంప్లెక్స్లో వీడియో సర్వే వరుసగా రెండో రోజైన ఆదివారం కూడా ప్రశాంతంగా కొనసాగింది. భారీ బందోబస్తు నడుమ సర్వే జరిపారు. సర్వేలో ఎక్కువ శాతం ముగిసిందని, సోమవారం కూడా సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
దాదాపు 50 శాతం సర్వే పూర్తయిందని వారణాసి జిల్లా కలెక్టర్ కౌషల్ రాజ్శర్మ తెలిపారు. మసీదు నిర్వహణ కమిటీ అభ్యంతరాల మేరకు గత వారం ఈ సర్వేను నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, మసీదు కమిటీ అభ్యంతరాలను తోసిపుచ్చిన వారణాసి కోర్టు.. ఈనెల 17లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. మరోవైపు సర్వేకు వ్యతిరేకంగా మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు వచ్చే వారంలో విచారణ జరుపనున్నది.