WTO | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రపంచ దేశాలకు ఆహారోత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి దేశాన్ని తీసుకుపోతామని గప్పాలు కొట్టిన బీజేపీ సర్కారు పాలనలో ప్రస్తుతం తిండి గింజలు దొరకని దుస్థితి దాపురించింది. ఆహార భద్రత కల్పించాలంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ముందు చేతులు సాచే దుస్థితికి భారత్ రావడమే ఇందుకు నిదర్శనం. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయంగా ఉండేందుకు ఆహార భద్రత ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ మేరకు అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి తేవాలని డబ్ల్యూటీవోకు 80 దేశాలు ఓ విజ్ఞాపన పత్రాన్ని అందజేశాయి.
దీనిపై భారత్ కూడా సంతకాలు చేసింది. అయితే, బియ్యం, గోధుమలను ఎక్కువగా పండించే దేశాల్లో ఒకటైన భారత్.. ఆయా ఆహారోత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని డబ్ల్యూటీవో ప్రతినిధులు తప్పుబడుతున్నారు. ఈ ఆంక్షలను ఎప్పుడు ఎత్తేస్తారని, సాగు విధానాలు, నిబంధనలు, దేశంలో బియ్యం, గోధుమల నిల్వలు ఏమేరకు ఉన్నాయో వంటి వివరాలు ఇవ్వాలని డబ్ల్యూటీవో సభ్య దేశాలు భారత్పై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ప్రపంచానికి ధాన్యాన్ని సరఫరా చేసేందుకు తాము సిద్ధమేనన్న భారత్.. ఇప్పుడు ఆహారోత్పత్తులపై ఆంక్షలు విధించడమేంటని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.