న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశ ప్రజలందరికీ కరోనా టీకాను ఉచితంగా వేస్తాం.. ఖర్చంతా మేమే భరిస్తాం.. అంటూ ప్రగల్భాలు పలికిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అసలు మర్మం చెప్పిం ది. టీకాను ఉచితంగా ఇవ్వడం కోసం పెట్రోల్ రేట్లను పెంచుతున్నామని వెల్లడించింది. పెట్రోల్ రేట్లు పెంచకపోతే టీకాకు డబ్బులెక్కడివి? అంటూ సాక్షాత్తూ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి ప్రజలనే ఎదురు ప్రశ్న వేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి కారణం టీకాలను ఉచితంగా పంపిణీ చేయడమేనన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి ఎంపీగా ఉన్న ఆయన గువాహటిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ‘మీరు ఉచితంగా కరోనా టీకా వేసుకొంటున్నారు. టీకాలు వేయడానికి ప్రభుత్వానికి ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది? ఇలా పన్నుల ద్వారా వచ్చిన డబ్బునే వ్యాక్సిన్ కోసం ఖర్చు చేస్తున్నారు’ అని అన్నారు. పెట్రోల్ను హిమాలయా నీళ్ల ధరతో పోల్చారు. ‘పెట్రోల్ ఏమంత ధర ఉంది. మీరు లీటర్ హిమాలయా నీళ్లు కొంటే పెట్రోల్ కంటే ఎక్కువే అవుతుంది’ అన్నారు.