పాట్నా: బీహార్లో మద్యం అమ్మకాలు, మద్యం సేవించడంపై నిషేధం విధించిన సీఎం నితీశ్ కుమార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమ మద్యం వ్యాపారాలను నియంత్రించేందుకు కొత్త పథకం ప్రకటించారు. ‘మద్యం వ్యాపారాన్ని వీడండి.. లక్ష బహుమతి పొందండి’ అని అక్రమంగా మద్యం అమ్మేవారికి పిలుపునిచ్చారు. శనివారం డ్రగ్ డీ అడిక్షన్ డే సందర్భంగా సీఎం నితీశ్ కుమార్ హిందీలో ట్వీట్ చేశారు. ‘మాదకద్రవ్యాల రహిత దినోత్సవం సందర్భంగా, అన్ని రకాల మాదకద్రవ్యాలను వీడాలని కోరుతున్నా. సుసంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బీహార్ కోసం మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించడంలో మన పాత్ర పోషిద్దామని ప్రతిజ్ఞ చేద్దాం’ అని పేర్కొన్నారు.
కాగా, బీహార్లో లిక్కర్ నిషేధంపై 2016లో చట్టం చేశారు. నాటి నుంచి సుమారు నాలుగు లక్షల మంది వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో ఎక్కువగా మద్యాన్ని సరఫరా చేసే పేదలే ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్రమ మద్యం వ్యాపారాన్ని వీడే వారితోపాటు తమ జీవనం కోసం అక్రమ రవాణా మార్గం ఎంచుకున్న వారు కూడా దానిని వీడితే లక్ష రివార్డు ఇస్తామని సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. అలాగే అక్రమంగా మద్యం సేవించే వారిని బదులు అక్రమంగా మద్యం అమ్మేవారిని అరెస్ట్ చేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు.
नशा मुक्ति दिवस के अवसर पर हम सभी तरह के नशे से मुक्ति का संकल्प लें तथा समृद्ध, स्वस्थ एवं खुशहाल बिहार हेतु नशामुक्त समाज के निर्माण में अपनी भूमिका का निर्वहन करें।
— Nitish Kumar (@NitishKumar) November 26, 2022