Supreme Court | ఇండియన్ కోస్ట్గార్డ్లో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్రం చేస్తున్న జాప్యంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ జరిపింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం కేంద్రాన్ని మందలించింది. మహిళలను అలానే వదిలేయలేమన్న సర్వోన్నత న్యాయస్థానం.. మహిళలకు శాశ్వత కమిషన్ కల్పించాల్సిందేని స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోకపోతే తామే (సుప్రీంకోర్టు) ఆ పని చేస్తుందని ధర్మాసనం తెలిపింది.
ఈ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి మాట్లాడుతూ ఆర్మీ, నేవీల కంటే కోస్ట్గార్డ్లో సేవలు భిన్నంగా ఉంటాయన్నారు. ఇందులో నిర్మాణాత్మక మార్పులు చేస్తున్నామని.. కోస్డ్గార్డ్ (ICG) ద్వారా బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ 2024లోనూ సమర్థత వంటి వాదనలకు తావులేదన్న ధర్మాసనం.. మహిళలను మినహాయించేందుకు ఇవి కారణాలు కాదంటూ ఏజీ వాదనలను తోసిపుచ్చింది. వెంటనే పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు చేయాలని.. ప్రభుత్వం ఆ పని చేయకపోతే.. తాము చేస్తామని స్పష్టం చేసింది.
కేసు విచారణను మార్చి ఒకటో తేదీకి వాయిదా వేసింది. అయితే, షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్లకు శాశ్వత కమిషన్ మంజూరు చేయాలని కోరుతూ ఇండియన్ కోస్ట్గార్డ్ అధికారి ప్రియాంక త్యాగి పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గత వారం విచారణ సందర్భంగా త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్స్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించినా.. ఇంకా పూర్వకాలంలోనే ఉన్నారా? అంటూ కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది. ఆర్మీ, నేవి మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ ఇస్తుండగా.. కోస్ట్గార్డ్ను వదిలివేయలేమని స్పష్టం చేసింది.