న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ ద్వారా తమ మొబైల్ ఫోన్పై నిఘా ఉంచినట్లుగా, హ్యాక్ అయినట్లుగా భావించే వ్యక్తులు, బాధితులు సంబంధిత వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ కోరింది. ఈ నెల 7వ తేదీలోగా సంబంధిత సమాచారంతో తమను సంప్రదించాలని తెలిపింది. పెగాసస్ స్పైవేర్ ద్వారా లక్ష్యగా చేసుకున్న వ్యక్తుల మొబైల్ ఫోన్లను పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ సాంకేతిక కమిటీ పేర్కొంది. ఈ మేరకు ఇటీవల ఒక బహిరంగ ప్రకటన జారీ చేసింది.
కాగా, ప్రముఖ వ్యక్తుల మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే ఇజ్రాయెల్ స్పైవేర్ ‘పెగాసస్’ అంశం గత ఏడాది దేశాన్ని కుదిపేసింది. న్యూస్ పోర్టల్ ‘ది వైర్’ నివేదికల ప్రకారం, భారత్లో 142 కంటే ఎక్కువ మంది వ్యక్తులను ఈ స్పైవేర్ ద్వారా లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్ కొన్ని సెల్ఫోన్లపై ఫోరెన్సిక్ విశ్లేషణ జరుపగా ఈ సంగతి బయటపటింది. భద్రతాపరమైన ఉల్లంఘనలు జరిగినట్లుగా ఆ సంస్థ నిర్ధారించినట్లు అంతర్జాతీయ మీడియా గ్రూప్ నివేదికల ద్వారా వెల్లడైంది.
భారత్ జాబితాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, ఇద్దరు కేంద్ర మంత్రులు, మాజీ ఎన్నికల కమిషనర్, ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు, మాజీ న్యాయమూర్తి, మాజీ అటార్నీ జనరల్ సన్నిహితుడు, రక్షణ శాఖ మాజీ అధికారులు, 40 మంది జర్నలిస్టులతోపాటు మరి కొందరు ఉన్నారు.
అయితే కేవలం ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలతో మాత్రమే తాము వ్యాపారం చేశామని, వారికే పెగాసస్ స్పైవేర్ను ఇచ్చామని దీనిని అభివృద్ధి చేసిన ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వో స్పష్టం చేసింది. దీంతో ఈ వ్యవహారంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పార్లమెంట్లో ఒక ప్రకటన ఇచ్చింది. పెగాసస్ ద్వారా ఎటువంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగలేదని పేర్కొంది. అయితే ఈ అంశంపై ఉభయ సభల్లో ఎలాంటి చర్చ జరగకపోవడంతో ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
మరోవైపు పెగాసస్ స్పైవేర్ వివాదంపై కొన్ని సంస్థలతోపాటు కొందరు వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దీనిపై లోతైన దర్యాప్తు కోసం సాంకేతిక నిఫుణులతో కూడిన ఒక కమిటీని సర్వోన్నత న్యాయస్థానం నియమించింది. దీంతో పెగాసస్ స్పైవేర్ ద్వారా తమ ఫోన్లను లక్ష్యంగా చేసుకున్నట్లుగా అనుమానిస్తున్న వ్యక్తుల నుండి సమాచారాన్ని ఆ కమిటీ కోరింది. అలాంటి వ్యక్తులు జనవరి 7లోగా తమను సంప్రదించాలని పబ్లిక్ నోటీసులో పేర్కొంది.