లక్నో: ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు. ఈ మిరాకిల్ (Miracle) సంఘటన ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో జరిగింది. కాలువలో మునిగిన ఒక బాలికను స్థానికులు కాపాడారు. అయితే అపస్మారక స్థితిలో ఉన్న ఆమె చనిపోయినట్లు అంతా భావించారు. దీంతో ఆమె దేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే తమ కుమార్తెను డాక్టర్కు చూపించాలని ఆమె తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు.
కాగా, ఒక డాక్టర్ ఆ బాలికను పరిశీలించగా ఆమె గుండె కొట్టుకుంటున్నట్లు గ్రహించారు. దీంతో ఆమెకు చికిత్స అందించారు. కడుపుపై నొక్కి నీరును బయటకు పంపారు. కొంత సపర్యల తర్వాత ఆ బాలిక కోలుకుంది. తన పేరుతోపాటు తల్లిదండ్రుల పేర్లు , గ్రామం పేరు చెప్పింది. దీంతో ఆ బాలికకు ఎలాంటి గాయం కాలేదని, ఆమె బాగానే ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు తమ కుమార్తె మానసిక పరిస్థితి సరిగా లేదని బాలిక తల్లి తెలిపింది. ఈ నేపథ్యంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తామని చెప్పింది.