PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): దేశభక్తిలో తమను మించినవారే లేరని బీజేపీ నేతలు చెప్పుకొంటారు. దేశం కోసం అమరులైన సైనికుల త్యాగాలను కూడా తమ ఘనతగానే వల్లెవేస్తారు. నాలుగేండ్ల కిందట పుల్వామా దుర్ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. యావత్తు జాతి శోకసంద్రంలో మునిగిపోయింది. అయితే, సైనికుల మరణాలపై ప్రధాని మోదీకి నిజంగానే బాధ ఉన్నదా? లేక ‘పుల్వామా’ భావోద్వేగాలను రెచ్చగొట్టి బీజేపీ ఓట్లను దండుకొన్నదా?.. మొన్న సత్యపాల్ మాలిక్, ఇప్పుడు ఆర్మీ మాజీ చీఫ్ చౌదరి వ్యాఖ్యలను విశ్లేషిస్తే ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అసమర్థత కారణంగానే 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందన్న జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపణలను మరిచిపోకముందే.. ఇదే అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్చౌదరి అవే తరహా వ్యాఖ్యలు చేశారు. దాడులు ఎక్కువగా జరిగే ఆ ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో కాకుండా ఆకాశమార్గంలో ప్రయాణిస్తే పుల్వామా దగ్గర జవాన్లపై అసలు దాడే జరిగేది కాదని రాయ్చౌదరీ అన్నారు. పాకిస్థాన్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే హైవే అత్యంత ప్రమాదకరమైనదన్న ఆయన.. ఆ మార్గం గుండా 2,500 మందితో కూడిన 78 వాహనాల కాన్వాయ్ వెళ్లాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. ‘పుల్వామా దాడుల్లో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ బాధ్యత ముమ్మాటికీ ప్రధాని నరేంద్రమోదీదే.
ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బగానే భావించాలి’ అన్నారు. ‘నిఘా వైఫల్యం వల్లే ఈ దాడి జరిగింది. దీనికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఈ మేరకు ఇంగ్లిష్ దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీఎస్ఎఫ్, ఎయిర్ఫోర్స్ దగ్గర విమానాలు, ఉన్నాయని, వాటిని సైనికులను తరలించడానికి వినియోగించాల్సిందని చెప్పారు. కాగా, పుల్వామా దాడులు జరిగిన రెండువారాల తర్వాత కేంద్రం బాలాకోట్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు నిర్వహించి వాటిని నాశనం చేసింది. మూడు నెలల అనంతరం జరిగిన ఎన్నికల్లో దీన్నే ప్రధాన ఎజెండాగా పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పుల్వామా అంశంపై ‘టెలిగ్రాఫ్’ కూడా ప్రధానంగా ఏడు ప్రశ్నలను తాజాగా లేవనెత్తింది. ప్రస్తుతం ఇవి వైరల్గా మారాయి.
☞ పుల్వామా దాడి జరిగిన సమయంలో (మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో) ప్రధాని మోదీ డిస్కవరీ చానల్ కోసం ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో షూటింగ్ నిమిత్తం ఉత్తరాఖండ్లోని కార్బెట్ వైల్డ్లైఫ్ పార్క్లో ఉన్నారు. నివేదికల ప్రకారం.. ఆయన రాత్రి 7 గంటలకు షూటింగ్ ముగించుకొని బయటకు వచ్చారు. ప్రపంచమే ఉలిక్కిపడే ఇలాంటి దాడి ఘటన జరిగాక కూడా, ప్రధాని 4 గంటల పాటు ఏమీ తెలియనట్టు పార్కులో ఎలా ఉన్నారు?
☞ పాకిస్థాన్ నుంచి 300 కిలోల ఆర్డీఎక్స్తో వచ్చిన ఒక వాహనం 10-15 రోజుల పాటు జమ్ముకశ్మీర్లోని గ్రామాలు, పట్టణాల్లోని రోడ్లపై యథేచ్ఛగా తిరిగినా ఇంటిలిజెన్స్ గుర్తించలేకపోయిందా?
☞ 2,500 మందితో కూడిన సీఆర్పీఎఫ్ దళాల్ని ప్రమాదకరమైన రోడ్డు మార్గంలో ఎలా అనుమతించారు? ‘భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయి. విమానాల్లో ప్రయాణించేలా అనుమతి ఇవ్వండి’ అని విజ్ఞప్తి చేసినా.. ఎందుకు పట్టించుకోలేదు?
☞ జవాన్లను తరలించేందుకు 78 వాహనాల భారీ కాన్వాయ్ను సిద్ధం చేసినప్పుడు, ముందుగానే, ఆ మార్గాన్ని ఎందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయలేదు?
☞ దాడి సమయంలో కాన్వాయ్ నెమ్మదిగా ప్రయాణించినట్టు సమాచారం. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే జరిగిందని కేంద్రం వాదన. వాతావరణ పరిస్థితులు బాగాలేనప్పుడు అంతపెద్దఎత్తున జవాన్ల తరలింపును అప్పుడే ఎందుకు చేపట్టారు?
☞ దుర్ఘటన తర్వాత కార్బెట్ పార్క్ బయట ఓ దాబా నుంచి తనకు మోదీ ఫోన్ చేశారని, అప్పుడు సంఘటనలోని లోపాలన్నీ ఆయనకు వివరించానని సత్యపాల్ మాలిక్ చెప్పారు. దీనిపై ప్రశాంతంగా ఉండాలని, ఎవరితో మాట్లాడవద్దంటూ మోదీ తనకు చెప్పినట్టు కూడా వెల్లడించారు. దీనిపై కేంద్రం ఎందుకు నోరుమెదపట్లేదు?
☞ పుల్వామా దాడి జరిగిన హైవే.. దేశంలోనే అత్యంత ప్రమాదకమైనదే కాదు, నిఘా వర్గాలతో అత్యంత భద్రతాపటిష్టను కలిగిఉన్నది కూడా. అలాంటి మార్గంలో ఈ దాడులు ఎలా జరిగాయి? అప్పుడు నిఘా విభాగం ఏం చేసినట్టు?