Supreme Court | న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఒకరిని ఆడ మనిషా లేదా మగవారా అని నిర్ణయించే విషయంలో జననేంద్రియాలే అంతిమం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. మనిషి మానసిక అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. స్వలింగ వివాహాలపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వివాహం అనేది సామాజిక అంశమని, ఇది ఎలా ఉండాలో నిర్ణయించే అధికారం పార్లమెంటుకే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. స్వలింగ వివాహాలకు అనుమతి ఇస్తే మతపరంగా కల్లోలం చెలరేగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వాదనను సీజేఐ చంద్రచూడ్ వ్యతిరేకించారు. ‘మేము పర్సనల్ న్యాయ చట్టాల జోలికి వెళ్లదలుచుకోలేదు. వివాహాల రకాలను వర్ణిస్తున్న స్పెషల్ మ్యారేజ్ చట్టం -1954 పైనే వాదనలు వింటాం. ఈ చట్టం ఆడ, మగ మధ్య వివాహం అని వర్ణించింది. ఆడ, మగ లింగ నిర్ధారణకు జననేంద్రియాలే అంతిమం కాదు’ అని పేర్కొన్నారు.
స్వలింగ వివాహాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతివ్వరాదని జమాతే ఉలేమా ఇ హింద్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ‘ఇద్దరు వ్యక్తులు స్వలింగ వివాహం చేసుకొని వారికి బిడ్డ పుడితే. ఆ బిడ్డకు తండ్రి ఎవరు? సీఆర్పీసీ చట్టం ప్రకారం వారిలో మహిళ ఎవరు? ఆ బిడ్డ మెయింటనెన్స్ ఎవరు చూస్తారు? ఇది సామాజికంగా చాలా సీరియస్ సమస్య’ అని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ భారత పౌరులందరికీ రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ప్రసాదిస్తున్నట్టయితే, వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవితాన్ని నిర్ణయించుకొనే హక్కు ఉన్నట్టేనని పేర్కొన్నారు. న్యాయమూర్తులు ఎస్కే కౌల్, ఎస్ఆర్ భట్, హిమా కోహ్లీ, పీఎస్ నరసింహ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ పిటిషన్లపై వాదనలను విననున్నది.