న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న సమయంలో ఉచితంగా ఫాబిఫ్లూ ఇస్తానన్న బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిక్కుల్లో పడ్డారు. జనాలకు ఫ్రీగా పంచి పెట్టేంత స్థాయితో ఫాబిఫ్లూ నీ దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇది అక్రమం కాదా? అని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశ్నించారు. దీనంతటికీ బుధవారం గంభీర్ చేసిన ఓ ట్వీట్ కారణమైంది. తూర్పు ఢిల్లీకి చెందిన వాళ్లు ఎంపీ ఆఫీసుకు వెళ్లి ఫ్రీగా ఫాబిఫ్లూ తీసుకెళ్లవచ్చు. కేవలం ఆధార్ కార్డు, ప్రిస్క్రిప్షన్ చూపిస్తే సరిపోతుంది అని గంభీర్ ట్వీట్ చేశాడు.
అయితే ఈ ట్వీట్పై వెంటనే కాంగ్రెస్, ఆమ్ పార్టీ నేతల స్పందించారు. నిజానికి ఫాబిఫ్లూను కొవిడ్ పేషెంట్ల కోసం విరివిగా వాడుతున్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లలాగే వీటికి కూడా కొరత ఏర్పడింది. ఇదే విషయాన్ని చెబుతూ.. అసలు నీ దగ్గర అన్ని ఫాబిఫ్లూలు ఎలా వచ్చాయని ఆ పార్టీలు ప్రశ్నించాయి. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు ఇంజెక్షన్లను దాచి పెడతారు, మహారాష్ట్ర మాజీ సీఎం రెమ్డెసివిర్ను ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీ పార్ట్టైమ్ ఎంపీ ప్రాణాధార మందులను దాచిపెట్టుకున్నారు. వీళ్లు ప్రజా ప్రతినిధులా, క్రిమినల్సా అంటూ ఆప్ నేత దుర్గేష్ పాఠక్ ట్వీట్ చేశారు.
అటు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా అసలు నీ దగ్గర ఎంత ఫాబిఫ్లూ ఉంది? ఎలా వచ్చింది? ఇలా పెట్టుకోవడం నేరం కాదా అని ప్రశ్నించారు. అయితే దీనికి గంభీర్ కూడా ఘాటుగానే స్పందించారు. రెమ్డెసివిర్ను బ్లాక్ మార్కెట్లో 30 వేలకు అమ్ముకోడానికి అనుమతి ఇచ్చినప్పుడు, ఢిల్లీలో ఆసుప్రతి బెడ్లను 5-10 లక్షలకు అమ్మినప్పుడు ఏమీ అనని వాళ్లు కొన్ని వందల ఫాబిఫ్లూను ఫ్రీగా ఇస్తే విమర్శిస్తారా అంటూ గంభీర్ ట్వీట్ చేశారు.