Assam | గువాహటి, ఆగస్టు 18: అస్సాంలోని డిమా హాసావో జిల్లాలో దాదాపు 3,000 బీఘాల (992 ఎకరాలు) భూమిని మహాబల్ సిమెంట్స్ అనే ప్రైవేట్ కంపెనీకి బదిలీ చేయాలన్న అస్సాం బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై గువాహటి హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఇది అసాధారణ కేటాయింపుగా అభివర్ణించింది. 3000 బీఘాలా? ఒక మొత్తం జిల్లానే రాసిచ్చేశారా? ఏం జరుగుతోంది? ఓ ప్రైవేట్ కంపెనీకి 3000 బీఘాల భూమి కేటాయింపా? ఎంత బీడు భూమి అయినప్పటికీ 3000 బీఘాలా? ఇదేమి నిర్ణయం? ఇదేమైనా జోకా? మీకు ఎంత భూమి అవసరం అన్నది కాదు ఇక్కడ ముఖ్యం. ప్రజా ప్రయోజనమే ముఖ్యం అంటూ విచారణ సందర్భంగా భూ కేటాయింపుపై జస్టిస్ సంజయ్ కుమార్ మేధి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
అన్ని రికార్డులు మా ముందుంచండి..
ఇంత భారీ మొత్తంలో జరిగిన భూకేటాయింపునకు సంబంధించిన అన్ని అధికారిక రికార్డులను, ప్రభుత్వ పాలసీని తమ ముందు ఉంచాలని ఉత్తర గచార్ హిల్స్ అటానమస్ కౌన్సిల్(ఎన్సీహెచ్ఏసీ)ని హైకోర్టు ఆదేశించింది. కంపెనీ తరఫున న్యాయవాది వాదిస్తూ అది అంతా బీడు భూమని, ఫ్యాక్టరీకి ఆమాత్రం భూమి అవసరమేనని అన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా మైనింగ్ లీజు మంజూరు అయిందని, అందుకు కొనసాగింపుగా ఈ భూ కేటాయింపు జరిగిందని ఆయన తెలిపారు. భూ కేటాయింపును వ్యతిరేకిస్తున్న పిటిషనర్లు చట్టబద్ధంగా పొందిన భూముల నుంచి ప్రాజెక్టు కోసం తమను ఖాళీ చేయిస్తున్నారని డిమా హాసావోలోని అనేక కుటుంబాలు ఆరోపిస్తున్నాయని తెలిపారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ జిల్లాగా డిమా హసావో ఉందని కోర్టు స్పష్టం చేసింది. ఇక్కడి ఆదివాసీ తెగలకు చెందిన హక్కులు, ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని కోర్టు పేర్కొంది. ఒక కంపెనీ కోసం అంత భారీ స్థాయిలో భూమిని ఎందుకు కేటాయించవలసి వచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. తదుపరి విచారణలో ప్రభుత్వ విధాన పత్రాలు, భూ రికార్డులను అధికారులు సమర్పించవలసి ఉంటుంది.