న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడటంతో కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో మనం తిన్న ఆహారానికి ఇచ్చే బిల్లులో గ్యాస్ చార్జీలను కూడా అదనంగా కలుపుతున్నారు. చెన్నైకు చెందిన ఒక రెస్టారెంట్లో మొత్తం రూ.67 అవ్వగా, దానిపై అదనంగా రూ.10 గ్యాస్ చార్జి విధించిన బిల్లు ఇప్పుడు ఆన్లైన్లో వైరల్గా మారింది. పెరుంగుడి చెన్నైలోని జీరాస్ అనే రెస్టారెంట్కు వెళ్లిన ఒక వినియోగదారుడు వడ, ఇడ్లీ తినగా రూ.66.66 రూపాయల బిల్లు కాగా, దానికి గ్యాస్ చార్జీల పేరిట రూ.10 అదనంగా కలిపి బిల్లు వేశారు. దీంతో ఆ బిల్లును అతడు ఆన్లైన్లో ఉంచడంతో వైరల్గా మారింది. గ్యాస్ కొరత కారణంగా ఈ అదనపు చార్జీ వసూలు చేస్తున్నామని హోటల్ నిర్వాహకులు తెలిపారు. కాగా, ఇప్పటికే పలు చిరు వ్యాపారులు సైతం అసలు ధరకు అదనంగా ఐదో, పదో వసూలు చేస్తున్నారని పలువురు ఈ సందర్భంగా కామెంట్ చేశారు.
ఇంకా చదవల్సిన వార్తలు
కట్నం.. కమర్షియల్ సిలిండర్!
రాయ్పూర్: దేశంలో వాణిజ్య సిలిండర్ల కొరత ప్రభావం పెండ్లిండ్లు, ఇతర వేడుకలపై తీవ్రంగా పడింది. ఛత్తీస్గఢ్లోని ఒక హోటల్ బయట ‘పెళ్లి కూతురు కట్నం అంటూ ఏమీ లేదు.. మీరు గ్యాస్ ఇస్తే చాలు.. మిగతా ఏర్పాట్లు హోటల్ చూసుకుంటుంది’ అన్న బోర్డు దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. అంబికాపూర్ హోటల్ వద్ద వెలసిన ఈ బోర్డు వివాహ సమయంలో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు ఎదుర్కొంటున్న గ్యాస్ కొరతను తెలియజేస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో పెండ్లి చేయడం సులభమే కానీ, అతిథులకు భోజనం పెట్టడమే కష్టంగా మారింది. గ్యాస్ కోసం తాము హెచ్పీ, ఇండియన్ ఆయిల్స్ లాంటి ప్రభుత్వ సంస్థలను నిత్యం సంప్రదిస్తున్నామని, వాణిజ్య గ్యాస్ను సరఫరా చేయానికి వారు తిరస్కరిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో తాము హోటల్ను, రెస్టారెంట్ను మూసివేయాలనుకుంటున్నామని హోటల్ మేనేజర్ పూర్ణేంద్ర మజుందార్ తెలిపారు.వివాహాలు, ఇతర వేడుకలకు ఆహారాన్ని సరఫరా చేసే పెద్ద కిచెన్లు మనుగడ సాధించలేవని అన్నారు.