జాముయ్: బీహార్లో ఇసుక మాఫియా దారుణానికి పాల్పడింది. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపట్ల కిరాతకంగా వ్యవహరించింది. ఇసుక ట్రాక్టర్తో పోలీస్ వాహనాన్ని మళ్లీమళ్లీ ఢీకొట్టింది. పోలీస్ వ్యాన్ దిగిన ఎస్ఐని ట్రాక్టర్తో తొక్కించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎస్ఐని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. ఒక హోంగార్డు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక డీఎస్పీ అభిషేక్ కుమార్ సింగ్ చెప్పారు.
ఘటనకు సంబంధించి డీఎస్పీ అభిషేక్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జాముయ్ జిల్లాలోని గర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోగల మహులియా తాండ్ గ్రామం నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందడంతో గర్హి ఎస్ఐ ప్రభాత్ రంజన్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లాడు. ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న ట్రాక్టర్కు పోలీస్ వాహనాన్ని అడ్డుపెట్టించాడు. అయినా ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ను ఆపకుండా పోలీస్ వాహనాన్ని మార్చిమార్చి ఢీకొట్టాడు. దాంతో ఎస్ఐ కిందకు దిగి అడ్డుకోబోగా.. ట్రాక్టర్ డ్రైవర్ ఆయనను ట్రాక్టర్తో తొక్కించాడు. అనంతరం ఘటనా స్థలం నుంచి పారిపోయాడు.
ఈ ఘటనలో ఎస్ఐ ప్రభాత్ రంజన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఓ హోంగార్డుకు కూడా గాయలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగానే ఎస్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పారిపోయిన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిని నవడా జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, ట్రాక్టర్ను సీజ్ చేశామని, త్వరలోనే నిందితుడిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.