నేషనల్ డెస్క్: ఒమిక్రాన్ ఉద్ధృతి నేపథ్యంలో బూస్టర్ డోసు వేసుకోవచ్చా లేదా అన్న ఊహాగానాలకు తెరపడింది. జనవరి 10 నుంచి ‘ముందు జాగ్రత్త’ డోసుగా ‘బూస్టర్’ను అందిస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. హెల్త్కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60 ఏండ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ముందస్తుగా బూస్టర్ డోసు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో అసలు దీర్ఘకాలిక వ్యాధులంటే ఏమిటి? బూస్టర్ డోసు కోసం ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి? రెండు డోసులు వేసుకున్న వ్యాక్సిన్నే తీసుకోవాలా? లేదంటే వేరే సంస్థ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చా? ‘ముందు జాగ్రత్త డోసు’ తీసుకునేందుకు ఎంత కాలం ఎడం ఉండాలి? అసలు దేశంలో ప్రస్తుతం ఎన్ని డోసుల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి?
జాబితాలో 20 క్యాటగిరీల వ్యాధులు..
60 ఏండ్లు పైబడి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ముందస్తుగా బూస్టర్ డోసు ఇస్తామని పేర్కొన్న కేంద్రం.. ఆ వ్యాధులపై స్పష్టత ఇచ్చేందుకు మార్గదర్శకాలు విడుదల చేసింది. 20 రకాల వ్యాధులను దీర్ఘకాలిక వ్యాధులుగా పరిగణించింది. హృద్రోగ సంబంధిత, మధుమేహం, స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సంబంధిత, క్యాన్సర్, సికిల్ సెల్, స్టెరాయిడ్ లేదా ఇమ్యునో సప్రెస్సార్ల మందులు ఎక్కువ కాలం వాడాల్సి రావడం, కండరాల బలహీనత, యాసిడ్ దాడికి గురైన వారు, మల్టిపుల్ డిజేబులిటీలు, వినికిడి సమస్యలు, అంధత్వం, తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలు వంటి అనారోగ్య సమస్యలను ఈ జాబితాలో పేర్కొంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు మెడికల్ ధ్రువపత్రం చూపిస్తేనే బూస్టర్ షాట్ వేస్తామన్నది.
ముందటిదే వేసుకోవాలి..
దేశంలో దాదాపు అందరూ మొదటి, రెండో డోసును ఒకే రకం వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే బూస్టర్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ వేసుకోవాలా అన్న అనుమానాలు ఉండేవి. హెల్త్కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లు, 60 ఏండ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వృద్ధులకు మూడో డోసుగా వారు అంతకుముందు రెండు డోసులు తీసుకున్న వ్యాక్సిన్నే ఇస్తామని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ చైర్మన్ డాక్టర్ ఎన్కే ఆరోరా పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన చేసే అవకాశం ఉంది. హైదరాబాద్కు చెందిన బయలాజికల్-ఈ సంస్థ అభివృద్ధి చేసిన కొర్బివాక్స్ వ్యాక్సిన్కు వచ్చే వారం అనుమతులు వచ్చే అవకాశం ఉంది. క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి వివరాలను సంస్థ ఇప్పటికే సమర్పించింది. కాగా, బూస్టర్ డోసు కోసం కొవాగ్జిన్ సమర్థత తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని భారత్ బయోటెక్ సంస్థ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)ను కోరింది.
సమావేశాల పరంపర..
15 నుంచి 18 ఏండ్ల వారికి ఏ కంపెనీ టీకా ఇవ్వాలి.. రెండో డోసుకు బూస్టర్ డోసుకు మధ్య గ్యాప్ తదితరాలపై కేంద్రం డిసెంబర్ 30లోగా నిర్ణయం తీసుకోనుంది. ఇందుకు సంబంధిత శాఖల అధికారులు, శాస్త్రవేత్తలతో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించనుంది. బూస్టర్ కోసం కొవిషీల్డ్, కొవాగ్జిన్ కాకుండా కొవోవాక్స్, స్పుత్నిక్ వీ, కొర్బివాక్స్ టీకాలు అందుబాటులో ఉన్నాయని, ఏది సరైనదో తుది నిర్ణయం వెలువరిస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
9 నెలల ఎడం ఉండాల్సిందే..
రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసు వేసుకునేందుకు కనీసం 9 నుంచి 12 నెలల గ్యాప్ ఉండాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. అయితే దీనిపై త్వరలోనే పూర్తి స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.
పిల్లలకు టీకా అశాస్త్రీయం
15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు టీకా ఇస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో.. ఈ నిర్ణయంపై ఎయిమ్స్ సీనియర్ ఎపిడమాలజిస్టు వ్యతిరేక గళం విప్పారు. ఈ నిర్ణయం అశాస్త్రీయమని కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ సంజయ్ రాయ్ పేర్కొన్నారు. దీనివల్ల అదనంగా ఎలాంటి లాభాలు కలగవని స్పష్టం చేశారు. ఇప్పటికే పిల్లలకు ఇస్తున్న దేశాల్లో పరిస్థితులపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటే బాగుండని సూచించారు. కొన్ని దేశాల్లో బూస్టర్ డోస్ వేసుకున్న వారికి కూడా వైరస్ సోకుతున్నదని పేర్కొన్నారు.
మొత్తం 422 ఒమిక్రాన్ కేసులు
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 422 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 130 మందికి నయం అయినట్లు కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 108 కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 79 కేసులు కేసులు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ విధించనుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ నెల 28 నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. కాగా, హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. మహారాష్ట్రలోని ముంబైలో ఒక్కరోజే 922 కరోనా కేసులు నమోదైనట్లు నిర్ధారణ అయింది.