చండీగఢ్: పంజాబ్ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కీలక నిందితుడు దీపక్ అలియాస్ టిను పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. గత రాత్రి మాన్సా జిల్లాలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరో కేసులో దర్యాప్తు కోసం వారెంట్పై గ్యాంగ్స్టర్ దీపక్ను సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (సీఐఏ) సిబ్బంది శనివారం రాత్రి 11 గంటల సమయంలో కపుర్తలా జైలు నుంచి మాన్సాకు తరలిస్తున్నారు.
అయితే దీపక్ ప్రైవేట్ వాహనంలోనే అతడ్ని తీసుకెళుతుండగా అర్ధరాత్రి వేళ తప్పించుకున్నాడని పోలీసులు చెప్పారు. పారిపోయిన నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. సిద్ధూ మూసేవాలా హత్య కేసులో మరో నిందితుడైన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి దీపక్ సన్నిహితుడు.
ఈ ఏడాది మే 29న పంజాబ్లోని మాన్సా జిల్లాలో సిద్ధూ మూసేవాలాగా పేరుగాంచిన సింగర్ శుభదీప్ సింగ్ సిద్ధూను హత్య చేశారు. స్నేహితుడు, బంధువుతో కలిసి జీపులో మాన్సాలోని జవహర్ కే గ్రామానికి సిద్ధూ వెళ్తుండగా ఆరుగురు షూటర్లు అతడిపై కాల్పులు జరిపారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యుడు గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించాడు. కలకలం రేపిన సిద్ధూ హత్య కేసు ఛార్జ్షీట్లో పేర్కొన్న 24 మంది నిందితుల్లో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్న దీపక్ అలియాస్ టిను ఒకడు.