హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్లో 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు వన్టైం సెటిల్మెంట్ పథకం కింద ఆస్తిపన్ను బకాయిలు చెల్లించేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ఆస్తిపన్ను బకాయిలను చెల్లించి 90శాతం వడ్డీ రాయితీని వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ కోరారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ 1900కోట్ల ఆస్తి పన్ను సేకరించాలని జీహెచ్ఎంసీ లక్ష్యాన్ని విధించగా బుధవారం వరకు 1484.10 కోట్ల వసూళ్లను రాబట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో వారం రోజులు మాత్రమే మిగిలి ఉండగా, మిగిలిన ఆస్తిపన్ను బకాయిలను పొందేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచార, చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నది. ఇంకా ఆస్తిపన్ను బకాయిలను చెల్లించని వారికి వెంటనే చెల్లించాలంటూ ఫోన్లకు సంక్షిప్త సమాచారాన్ని చేరవేస్తున్నారు. జీహెచ్ఎంసీ సిటిజన్ సర్వీస్ సెంటర్, మీ సేవా సెంటర్ లేదా ఆన్లైన్, మై జీహెచ్ఎంసీ యాప్లో బకాయిలు చెల్లించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.