బారాబంకి/ముజఫర్నగర్, సెప్టెంబర్ 25: మొన్న ఒక మహిళపై గ్యాంగ్ రేప్.. నిన్న ఒక మైనర్పై గ్యాంగ్రేప్.. నేడు మరో మహిళపై గ్యాంగ్రేప్. ఇదీ ఉత్తరప్రదేశ్లో మహిళలకు ఉన్న రక్షణ. ఇందులో కొన్ని ఘటనలు పోలీస్స్టేషన్కు చేరుతుండగా, అనేకం రికార్డులోకి కూడా రావడం లేదు. తాజాగా బారాబంకి జిల్లాలో మహిళకు బలవంతంగా మద్యం తాగించి నలుగురు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. శనివారం ఒక వ్యక్తి బాధిత మహిళను చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. మరో ముగ్గురు వ్యక్తులు అక్కడి చేరుకొని మహిళకు బలవంతంగా మద్యం తాగించి లైంగికదాడికి పాల్పడ్డారు. బాధితురాలు ఆదివారం భర్తతో కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.
ముజఫర్నగర్లో బాలికపై లైంగికదాడి
యూపీలోని ముజఫర్నగర్ జిల్లాలో 15 ఏండ్ల బాలికపై 21 ఏండ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. కోచింగ్ సెంటర్లో బాలికతో యువకుడు పరిచయం పెంచుకున్నాడు. మాయమాటలు చెప్పి ఈ ఏడాది జనవరిలో బాలికపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. లైంగికదాడికి సంబంధించిన వీడియోలను నిందితుడు ఇటీవల సోషల్మీడియాలో పోస్టు చేయడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.