జమ్ముకశ్మీర్: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్థాన్ గెలిచిందని ఆగ్రాలో కొంతమంది కేరింతలు కొట్టినందుకు బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టిందని, అసలది నేరం ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు భారత్ గెలిచినా పాకిస్థానీలు అభినందించడం, పాకిస్థాన్ గెలిచినా భారతీయులు అభినందించడం వాజ్పేయి హయాం నుంచి తనకు గుర్తున్నదని చెప్పారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా అప్పట్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని ప్రశంసించారని మెహబూబా ముఫ్తీ గుర్తుచేశారు. కానీ, ఆగ్రాలో మాత్రం పాకిస్థాన్ గెలిచినందుకు కేరింతలు కొట్టినవారిపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. అంతేగాక వాళ్ల కేసును వాదించడానికి ఒక్క న్యాయవాది కూడా ముందుకు రాకపోవడం దుర్మార్గమన్నారు. ఇదంతా చూస్తుంటే తనకు గాంధీజీ భారత్ కాస్తా గాడ్సే భారత్లా మారుతున్నట్లు అనిపిస్తున్నదని ముఫ్తీ వ్యాఖ్యానించారు.