న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గాంధీ శాంతి పురస్కారానికి గోరఖ్పూర్కు చెందిన ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘గీతా ప్రెస్’ ఎంపికైంది. అహింస, గాంధేయ పద్ధతుల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరివర్తన కోసం చేసిన కృషికి గుర్తింపుగా 2021 ఏడాదికి గానూ ఈ పురస్కారాన్ని అందజేస్తున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. శాంతి, సామాజిక సామరస్యంపై మహాత్మా గాంధీ ఆలోచనల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంలో గీతా ప్రెస్ గణనీయమైన పాత్ర పోషించిందని జ్యూరీ ప్రశంసించింది. గీతాప్రెస్ స్థాపించి వందేండ్లు అయిన సందర్భంలో ఈ పురస్కారానికి ఎంపిక కావటం సామాజిక సేవలో ఆ సంస్థ కృషికి దక్కిన గొప్ప గుర్తింపు అని తెలిపింది. 1923లో ప్రారంభమైన గీతా ప్రెస్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. 14 భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ప్రచురించి రికార్డు నెలకొల్పింది.