బెంగళూరు : కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్రెడ్డి అధికార బీజేపీకి షాక్ ఇచ్చారు. కాషాయ పార్టీకి గుడ్బై చెప్పిన ఆయన సొంత పార్టీని స్థాపించారు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పార్టీని ఆదివారం ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అక్రమ మైనింగ్ ఆరోపణలపై గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితం అనుభవించారు. ఆ తర్వాత బీజేపీ నేతలతో విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఆయన 2015 నుంచి బెయిల్పై ఉన్నారు. బెయిల్ ఇచ్చే సమయంలో గాలి జనార్దన్రెడ్డికి సుప్రీం కోర్టు కొన్ని ఆంక్షలు విధించింది. పాస్పోర్టులను అప్పగించాలని, తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే పలు కేసులు, వివాదాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనార్దన్ రెడ్డి పార్టీని స్థాపించడంతో కర్ణాటకలో సంచలనంగా మారింది. పార్టీని ప్రకటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన జీవితంలో రాజకీయంగా మరో ఎపిసోడ్ ప్రారంభమైందని, కల్యాణ కర్ణాటక ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకే తాను ఇక్కడ ఉన్నట్టు చెప్పారు.
రాజకీయ పార్టీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను విడగొట్టి లబ్ధి పొందాలనుకుంటే ఇక్కడ కుదరదన్న ఆయన.. కర్ణాటక ప్రజలు ఎప్పుడూ ఐక్యంగా ఉన్నారని, ఉంటారన్నారు. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన మంత్రి శ్రీరాములుతో విభేదాలున్నట్లుగా వస్తున్న వార్తలపైనా స్పందించారు. కాషాయ పార్టీలో ఎవరితోనూ తనకు విభేదాలు లేవని, శ్రీరాములు తన బాల్య స్నేహితుడని, అతనితో సంబంధాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.