నాగ్పూర్, ఆగస్టు 28: అవసరం ఉన్నంత వరకు వాడుకొని, తర్వాత పక్కన పెట్టేసే (యూజ్ అండ్ త్రో) విధానం సరికాదని, అటువంటి పని ఎప్పటికీ చేయకూడదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. వ్యాపారంలో అయినా రాజకీయాలు అయినా.. ఎక్కడైనా మానవ సంబంధాలు అనేది ఎవరికైనా అతిపెద్ద బలమని, వాటిని పాటించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. శనివారం మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒక మనిషి ఓడిపోయినప్పుడు ఆ వ్యక్తి శకం ముగిసినట్టు కాదని, అతను బాధ్యతల నుంచి తప్పుకునప్పుడే అతని ముగింపు మొదలైనట్టు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తన ఆత్మకథలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఉదహరించారు. ‘మం చి రోజులైనా, చెడ్డ రోజులైనా.. ఒకసారి ఎవరి చేతినైనా పట్టుకుంటే, దాన్ని ఎప్పటికీ వదలకూడదు’ అని అన్నారు. ఆశలను, కలలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని యువ పారిశ్రామికవేత్తలకు సూచించారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీ ఉద్వాసనకు గురైన విషయం తెలిసిందే. పార్టీలో మోదీ-షా ద్వయం పెత్తనం పెరిగిపోవడం పట్ల గడ్కరీ అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో సొంత ప్రభుత్వంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ వాదనకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. ముంబైలో జరిగిన నాట్కాన్ సదస్సులో, అనంతరం నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. సర్కారు సకాలంలో స్పందించడం లేదని, ఇదే అతిపెద్ద సమస్యగా తయారైందని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ వ్యవస్థాపకుల కృషి వల్లే నేడు కేంద్రంలో మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిందంటూ సీనియర్ల ప్రాధాన్యాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. అంతకుముందు కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ.. నేడు రాజకీయాలు అంటే అధికారం కోసం వెంపర్లాడటం మాదిరిగా తయారైందని, రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనిపిస్తున్నది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పారిశ్రామికవేత్తల సమావేశంలో గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు పరోక్షంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాను ఉద్దేశించినవేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.