న్యూఢిల్లీ : సాంకేతికత, గ్రీన్ ఫ్యూయల్లో వేగంగా అభివృద్ధి సాధించడం ద్వారా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్స్ ధర తగ్గుతుందని, రాబోయే రెండేళ్లలో పెట్రోల్తో నడిచే వాహనాలతో సమానంగా వాటిని తయారు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. మంగళవారం లోక్సభలో ఆయన సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన దేశీయ ఇంధనం వైపు మారాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. గ్రీన్ ఫ్యూయల్ ఇంధనం త్వరలో అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామన్న ఆయన.. తద్వారా కాలుష్యం తగ్గుతుందన్నారు. ఢిల్లీలో మొత్తం పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. రవాణా కోసం హైడ్రోజన్ టెక్నాలజీని అవలంభించాలని ఎంపీలను గడ్కరీ కోరారు.
తమ జిల్లాల్లో మురుగునీటిని గ్రీన్ హైడ్రోజన్గా మార్చేందుకు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రోజన్ చౌకైన ఇంధనమన్నారు. గరిష్ఠంగా రెండేళ్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, కార్లు, ఆటోరిక్షాల ధర పెట్రోల్తో నడిచే వాటితో సరిసమానంగా ఉంటుందన్నారు. లిథియం అయాన్ బ్యాటరీ ధరలు తగ్గుతున్నాయని, అయాన్ ఈ అల్యూమినియం – అయాన్, సోడియం – అయాన్, బ్యారటరీ కెమిస్ట్రీని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పెట్రోల్ వాహనం అయితే రూ.100, ఎలక్ట్రిక్ వాహనంపై రూ.10 వినియోగానికి ఖర్చవుతుందన్నారు. ట్రాఫిక్ను తగ్గించేందుకు, కాలుష్య సమష్యను పరిష్కరించేందుకు ఢిల్లీలో రూ.62వేల కోట్ల విలువైన రోడ్ ప్రాజెక్టులను చేపట్టినట్లు గడ్కరీ పేర్కొన్నారు.
తాను ఎయిర్పోర్ట్కు వెళ్లి తిరిగి వచ్చిన ప్రతీసారి ధౌలా కువాన్ ట్రాఫిక్లో చిక్కుకుపోయినట్లు మంత్రి గుర్తు చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇందులో బాగంగా రింగ్ రోడ్లు, ఇతర రోడ్లను నిర్మించామని గడ్కరీ తెలిపారు. 2040 నాటికి భారత్లో రోడ్డు మౌలిక సదుపాయాలు అమెరికాతో సమానంగా తీర్చిదిద్దాలన్నది తన ప్రయత్నమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెన్నెడీ కొటేషన్స్ను ప్రస్తావించారు. హైవే కనెక్టివిటీ, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెరుగుదలని ఉందన్న ఆయన.. ఇప్పుడు ఢిల్లీ నుండి మీరట్కు నాలుగు గంటల ప్రయాణం కాకుండా కేవలం 40 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని చెప్పారు.