న్యూఢిల్లీ: జీ20 సమ్మిట్ (G20 Summit)కు హాజరయ్యే అతిథులకు లంగూర్ కటౌట్లు (langur cutouts) స్వాగతం పలుకనున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ల వద్ద ఉండే వ్యక్తులు లంగూర్ మాదిరిగా శబ్దాలు కూడా చేయనున్నారు. జీ20 సదస్సుకు కోతుల బెడద లేకుండా ఉండేందుకు ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. జీ20 కూటమికి ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్నది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సహా పలు దేశాల అధ్యక్షులు ఈ సమ్మిట్కు స్వయంగా హాజరవుతున్నారు.
కాగా, దేశ రాజధానిలో జరుగనున్న ప్రపంచ సదస్సు కోసం కేంద్రంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం సుందరీకరణ పనులతోపాటు అతిథులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కోతుల బెడదను నివారించేందుకు లంగూర్ కటౌట్లు ఏర్పాటు చేశారు. అలాగే లంగూర్ల మాదిరిగా అరిచి కోతులను తరిమేందుకు శిక్షణ పొందిన 40 మంది వ్యక్తులను కూడా లంగూర్ కటౌట్ల వద్ద ఉంచుతున్నారు. తద్వారా జీ20 అతిథుల కాన్వాయ్లకు ఆ ప్రాంతంలోని కోతుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.