న్యూఢిల్లీ, ఆగస్టు 30: కాంగ్రెస్లోని జీ-23 గ్రూపు అసమ్మతివాద నేతలు గులాం నబీ ఆజాద్ ఇంటిలో
సమావేశమయ్యారు. 2020లో పార్టీలో సంస్కరణలు డిమాండ్ చేస్తూ సోనియాగాంధీకి లేఖ రాసి సంచలనం సృష్టించిన ఈ గ్రూపు విడిగా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అభ్యర్థిని నిలబెడుతుందని తెలుస్తున్నది. మంగళవారం ఆజాద్ ఇంటిలో జరిగిన సమావేశానికి హాజరైనవారిలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హూడా, ఆనంద్ శర్మ, పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నారు.
అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల గురించి సమావేశంలో చర్చించినట్టు తెలుస్తున్నది. 19న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్లో చివరిసారిగా 2000 నవంబరులో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. మరోవైపు, ఆజాద్కు మద్దతుగా జమ్ముకశ్మీర్ కాంగ్రెస్ నాయకుల రాజీనామాలు కొనసాగుతున్నా యి. తాజాగా మరో 64 మంది పార్టీని వీడారు. వీరిలో మాజీ డిప్యూటీ సీఎం తారా చంద్, మాజీ మంత్రులు అబ్దుల్ మాజిద్ వనీ, మనోహర్లాల్ శర్మ, ఘరూ రామ్, మాజీ ఎమ్మెల్యే బల్వన్సింగ్ ఉన్నారు.
అవి ఊహాగానాలే
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరపడం పార్టీకి మంచిదేనని సీనియర్ నేత, తిరువనంతపురం పార్లమెంటు సభ్యుడు శశిథరూర్ మంగళవారం విలేకరులతో అన్నారు. తాను పోటీ చేయడంపై ఇప్పటిదాకా వచ్చినవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాతే పోటీ సంగతి వెల్లడిస్తానని చెప్పారు.