G20 | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం, పశ్చిమ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ జీ20 దేశాల విదేశాంగ మంత్రులు బుధ, గురువారాల్లో దేశ రాజధాని ఢిల్లీలో సమావేశంకానున్నారు. సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి కేథరీన్ కొలోనా, జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బీర్బాక్, బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్తో పాటు పలు ఐరోపా దేశాల విదేశాంగ మంత్రులు హాజరుకానున్నది. బుధవారం విదేశీ అతిథులకు స్వాగతం పలికే కార్యక్రమం ఏర్పాటు చేయగా.. గురువారం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు.
సమావేశాలో ఆహారం, ఇంధన భద్రత, తీవ్రవాదం, మానవతా సహాయం, విపత్తుల సహాయం తదితర అంశాలపై చర్చించే అవకాశలున్నాయి. జీ20 సమావేశాలకు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్లను భారత్ అతిథులుగా ఆహ్వానించింది. ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియో త్జాన్, ఆస్ట్రేలియాకు చెందిన పెన్నీ వాంగ్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి యువరాజ్ ఫైసల్ బిన్ ఫర్హాన్, ఇండోనేషియాకు చెందిన రెట్నో మార్సుడి, అర్జెంటీనా విదేశాంగ మంత్రి శాంటియాగో కెఫిరో సమావేశాలకు హాజరుకానున్నారు. మరో వైపు జీ20 సమావేశాలకు జపాన్ విదేశాంగ మంత్రి హాజరుకావడం లేదు. దేశీయ పార్లమెంటరీ సమావేశాల కారణంగా సమావేశానికి హాజరు కావడం లేదని మంత్రి హయాషి తెలిపారు. అయితే.. ఆయన స్థానంలో డెప్యూటీ మంత్రిని పంపాలని టోక్యో యోచిస్తున్నది.
చైనా విదేశాంగ మంత్రి 2019 తర్వాత తొలిసారిగా భారత్లో పర్యటించనున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ఆయనను సమావేశానికి ఆహ్వానించారు. సరిహద్దుపై ప్రత్యేక ప్రతినిధుల చర్చలకు హాజరయ్యేందుకు 2019లో విదేశాంగ మంత్రి దేశ రాజధాని ఢిల్లీకి రాగా.. ఆ తర్వాత మళ్లీ రావడం ఇదే తొలిసారి. 2020 మేలో తూర్పు లడఖ్లో ఘర్షణ అనంతరం.. నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు ఆదేశాల మధ్య 17సార్లు ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి నెలకొనే వరకు చైనాతో సంబంధాలు మామూలు స్థితికి రావని భారత్ స్పష్టం చేస్తున్నది. గతేడాది డిసెంబర్ 1న భారత్కు జీ20 అధ్యక్ష పదవి లభించింది. ప్రపంచ జీడీపీలో దాదాపు 85శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75శాతం కంటే జీ20 సభ్య దేశాలదే వాటా ఎక్కువ.