పంజాబ్లో ఆమ్ఆద్మీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ప్రతిపక్షాలను చీపురుతో ఊడ్చిపారేస్తోంది. ప్రతిపక్షాలు ఆప్ దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ ముందు నుంచి కూడా పంజాబ్లో ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. సీఎం అభ్యర్థి విషయంలోనూ ఒంటెత్తు పోకడలకు పోకుండా, ప్రజలు నిర్ణయించిన వారే సీఎం అభ్యర్థి అంటూ తేల్చి చెప్పారు. చివరికి ప్రజలు భగవంత్ మాన్ వైపే మొగ్గు చూపారు. కేజ్రీవాల్ కూడా ఆయన్నే సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. ధూరీ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ గెలుపొందారు కూడా. ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి దల్బీర్ సింగ్పై గెలుపొందారు.
అద్భుతమైన కమెడియన్…
భగవంత్ మాన్.. అద్భుతమైన కమెడియన్గా ప్రజల్లో గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి, ఆప్లో చేరారు. రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆయన్న పంజాబ్లో జుగ్నూ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. టీవీ షోల్లో కూడా పాల్గొన్నారు. 1973, అక్టోబర్ 17న ఆయన సంగరూర్ జిల్లాలో జన్మించారు. ఇంటర్మీడియట్ మాత్రమే చదువుకున్నారు. 1992 లో బీకాం చేయడానికి ఈయన ఉదమ్ సింగ్ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నా… మధ్యలోనే ఆపేశారు. ఇంద్రప్రీత్ కౌర్ను వివాహం చేసుకున్నారు. ఎంపీగా గెలిచిన సంవత్సరం తర్వాత.. వీరిద్దరూ దూరం దూరంగానే వుంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఈ ఇద్దరు పిల్లలూ తల్లి దగ్గరే వుంటున్నారు.
పంజాబ్ పీపుల్స్ నుంచి రాజకీయాలు షురూ..
భగవంత్ మాన్ సింగ్ మొదటి నుంచీ ఆప్లో లేరు. మొట్ట మొదట ఆయన రాజకీయం మన్ప్రీత్ సింగ్ బాదల్ పార్టీ అయిన పంజాబ్ పీపుల్స్ పార్టీ నుంచి ప్రారంభమైంది. 2012 లో ఈ పార్టీ నుంచే ఆయన అసెంబ్లీకి పోటీ చేసి, ఓడిపోయారు. అయితే.. కొన్ని రోజుల తర్వాత మన్ప్రీత్ సింగ్ కాంగ్రెస్లో చేరిపోయారు. భగవంత్ మాన్ ఆప్ వైపు మొగ్గు చూపారు.
2014 లో ఆప్లో చేరిన భగవంత్ మాన్
2014 నుంచి భగవంత్ మాన్ ఆప్లో కొనసాగుతున్నారు. సంగరూర్ నుంచి ఎంపీగా నిలబడి, గెలుపొందారు. దాదాపు 2 లక్షల పైచిలుకు ఓట్లతో విజయం దుందుభి మోగించారు. ఆప్లో సైలెంట్ వర్కర్గా గుర్తింపు పొందారు. సీఎం కేజ్రీవాల్కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందారు. కేజ్రీవాల్ గీచిన గీతను దాటరని ప్రతీతి. అందరిపై అవినీతి ఆరోపణలు వచ్చినా… భగవంత్ మాన్పై మాత్రం ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. ఆప్లో ఆయన్ను అందరూ మిస్టర్ క్లీన్ అంటుంటారు. ఈ కోణమే కేజ్రీవాల్ను అత్యంత ఆకర్షించిందని చెబుతుంటారు.