ముంబై: మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం నిరసనలు తీవ్రమవుతున్నాయి. (Maratha quota protest) విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న మరాఠా ప్రజలు ఆదివారం నుంచి సామూహిక నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఆదివారం నుంచి నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని చెప్పారు. ‘రేపటి నుంచి గ్రామస్తులు కేవలం నీరు తాగి నిరాహార దీక్ష చేస్తారు. మరాఠా సమాజానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో నిరాహార దీక్షలో పాల్గొంటారు. దేశంలో ముఖ్యమైన ఉద్యమంగా మారుతుంది’ అని పాటిల్ అన్నారు. అక్టోబర్ 31 నుంచి ఉద్యమం మూడో దశ ప్రారంభమవుతుందని చెప్పారు.
కాగా, మరాఠా రిజర్వేషన్ డిమాండ్ నేపథ్యంలో శుక్రవారం బీడ్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి వాటర్ ట్యాంకులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ ఆందోళనలో సూసైడ్ చేసుకున్న వారి సంఖ్య మూడుకు చేరింది. అయితే మరాఠా ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడవద్దని మనోజ్ పాటిల్ పిలుపునిచ్చారు. శాంతియుతంగా నిరసనలు చేపట్టాలని అన్నారు. తమ ఆందోళన గురించి పట్టించుకోని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్పై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.