ఇంఫాల్: బీజేపీ పాలిత మణిపూర్లో హింసాత్మక సంఘటనలు (Manipur Violence) ఇంకా కొనసాగుతున్నాయి. తాజా కాల్పుల్లో ఒక పోలీస్ మరణించగా ఇద్దరు స్థానికులు గాయపడ్డారు. చురచంద్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో చింగ్ఫీ బంకర్ నంబర్ 1 వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఒంఖోమాంగ్ తలపై గన్తో కాల్పులు జరిపి చంపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు స్థానికులు కూడా గాయపడినట్లు అధికారులు తెలిపారు.
కాగా, తాజా సంఘటనకు ముందు మంగళవారం ఉదయం కాంగ్పోక్పి జిల్లాలో ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అలాగే సెప్టెంబర్ 8న తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ వద్ద జరిగిన ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
మరోవైపు మణిపూర్లో మెజారిటీ మైతీ వర్గం ఎస్టీ హోదా కోసం డిమాండ్ చేస్తున్నది. కుకీ వర్గం దీనిని వ్యతిరేకించడంతో మే 3 నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 180 మందికిపైగా మరణించగా వందల సంఖ్యలో గాయపడ్డారు. నిరాశ్రయులైన వేలాది మంది ప్రజలు ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.