ఇంఫాల్: మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. సాయుధ దుండగులు ఒక గ్రామంపై దాడి చేశారు. పలువురిపై కాల్పులు జరిపారు. పలు ఇళ్లకు నిప్పంటించారు. దుండగుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. (Violence In Manipur) భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో న్యూ కీథెల్మాన్బి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 4.10 గంటల సమయంలో సాయుధులైన దుండగులు లోయిబోల్ గ్రామంపై దాడి చేశారు. సాయుధ మిలిటెంట్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. పలు ఇళ్లకు వారు నిప్పంటించగా అవి కాలి బూడిదయ్యాయి. ఈ సంఘటనతో ఆ గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గ్రామంపై దాడి చేసిన సాయుధ మిలిటెంట్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభావిత ప్రాంతం, పరిసర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో అక్కడి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.