Jammu and Kashmir : కాశ్మీర్ను మంచు తుఫాన్ అతలాకుతలం చేస్తోంది. రెండు రోజులుగా మంచు తుఫానుతోపాటు వర్షం కూడా జమ్ము కాశ్మీర్ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. మంగళవారం ఉదయం కాస్త తెరిపినిచ్చినా తర్వాత మంచు కురుస్తూనే ఉంది. దీంతో లోయలో జనజీవనం స్తంభించింది. మార్చి 20 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని ఐఎండీ ప్రకటించింది. మంచు తుఫాన్ కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అనేక చోట్ల మైనస్ డిగ్రీలకు టెంపరేచర్ పడిపోయింది.
చాలా చోట్ల 12 అంగుళాల మేర మంచు కురుస్తోంది. జోజిలా పాస్ ప్రాంతంలో 5 అంగుళాలు, సోనామార్గ్ ప్రాంతంలో 3-4 అంగుళాల మంచు కురుస్తోంది. ముఖ్యంగా ఎత్తైన ప్రాంతాలు చాలా ప్రభావితమవుతున్నాయి. రోడ్లపై మంచు పేరుకుపోయింది. దీంతో అధికారులు రోడ్లు మూసివేశారు. అలాగే పొగ మంచు కారణంగా చాలా దూరం వరకు వాహనాలు కనిపించడం లేదు. దీంతో అనంతనాగ్ జిల్లాలోని సింతన్ పాస్ నుంచి కిష్ట్వార్ వెళ్లే నేషనల్ హైవే 244పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాత్రంతా వాహనాలు రోడ్లపైనే ఉండిపోయాయి. ఇదే సమయంలో ఇక్కడ సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. అయినప్పటికీ ఈ ప్రాంతం నుంచి దాదాపు 400 మంది టూరిస్టులు, సాధారణ ప్రజల్ని అధికారులు రక్షించారు.
ఇండియన్ ఆర్మీకి చెందిన 19 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయి. వాతావరణం అనుకూలించకపోయినా ప్రత్యేక సామగ్రి, తాళ్లు, చైన్లతో సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై చిక్కుకుపోయిన వాహనాల్నలి, ప్రయాణికుల్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇది మంచు కురిసే సమయం అవ్వడంతోపాటు టులిప్ పూలు పూసే సమయం కావడంతో పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.