రెవారీ: రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ గోగమేడిని కాల్చిచంపిన హంతకులు మరుసటి రోజు హర్యానా రాష్ట్రంలోని రెవారీ రైల్వేస్టేషన్లో తచ్చాడిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. డిసెంబర్ 5న సుఖ్దేవ్ సింగ్ను చంపిన హంతకులు నితిన్ ఫౌజీ, రోహిత్ రాథోడ్ డిసెంబర్ 6న రెవారీ రైల్వే స్టేషన్లో ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్లు హిస్సార్కు వెళ్లి ఉధమ్ అనే వ్యక్తిని కలిసినట్లు పోలీసులు విచారణలో తేలింది.
ముందుగా అనుకున్న ప్రకారం ఉధమ్ నిందితులను తన కారులో తీసుకుని హిమాచల్ప్రదేశ్లోని కులూకు బయలుదేరాడు. అయితే కులూలో అప్పటికే పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలుసుకుని చండీగఢ్కు వచ్చారు. చండీగఢ్లో ఆదివారం ఉదయం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చిక్కారు. సుఖ్దేవ్ హత్యకు సహకరించిన మరో వ్యక్తిని శనివారమే జైపూర్లో అరెస్టు చేశారు.
కాగా, డిసెంబర్ 5న జైపూర్లోని తన నివాసంలోనే సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యలో ఇద్దరు నిందితులు పాల్గొన్నారని పోలీసులు ముందుగా భావించారు. కానీ, సుఖ్దేవ్ సింగ్ను చంపేందుకు మొత్తం ముగ్గురు వ్యక్తులు వచ్చారని, వారిలో ఒకడైన నవీన్ షెకావత్. సుఖ్దేవ్ గన్మెన్ జరిపిన కాల్పుల్లో చనిపోయాడని తర్వాత తేలింది. ప్రస్తుతం సుఖ్దేవ్ గన్మెన్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.