చెన్నై, నవంబర్ 15: ప్రముఖ కమ్యూనిస్టు ఉద్యమ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్ శంకరయ్య బుధవారం కన్నుమూశారు. 101 ఏండ్ల ఈ సీపీఐ(ఎం) నేత ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న శంకరయ్య పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. ప్రధానంగా ఆలయ ప్రవేశ ఉద్యమం, హిందీ వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. శంకరయ్య మృతికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ప్రజలకు చేసిన సేవలు, త్యాగాలు చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతాయని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.