లక్నో, ఫిబ్రవరి 22: ఉత్తరప్రదేశ్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. వీటిలో 16 రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2017 ఎన్నికల్లో ఈ 59 నియోజకవర్గాలకు గానూ బీజేపీ 51 స్థానాల్లో విజయం సాధించగా, ఎస్పీ 4, బీఎస్పీ 3, అప్నాదళ్(సోనేలాల్) ఒక్క స్థానం దక్కించుకున్నాయి.
కీలక స్థానాల్లో పోలింగ్
గతేడాది అక్టోబర్ 3న కేంద్ర మంత్రి అజయ్మిశ్రా తనయుడు అశిష్ మిశ్రా రైతులపై సాగించిన హింసాకాండకు సాక్ష్యంగా ఉన్న లఖింపూర్ ఖీరీ ప్రాంతంతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ జిల్లాలో కూడా ఇదే విడుతలో పోలింగ్ జరుగుతున్నది. లఖింపూర్లో బీజేపీ తరపున యోగేశ్వర్మ పోటీచేస్తుండగా, ఉత్కార్స్ వర్మ మాథుర్ను సమాజ్వాదీ బరిలోకి దింపింది. రాయ్బరేలీలో అదితి సింగ్(బీజేపీ), మనీష్ చౌహాన్(కాంగ్రెస్) పోటీపడుతున్నారు. ఇక, ఈ విడుతలో టెరాయ్ రీజియన్లోని పిలిభిత్ బీజేపీకి పెద్ద సవాలుగా ఉన్నది. వ్యవసాయ చట్టాలతో పాటు, పలు అంశాలపై సంబంధించి కేంద్రంలోని సొంత పార్టీ ప్రభుత్వంపైనే బహిరంగ విమర్శలు చేస్తున్న బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పిలిభిత్ నుంచే ఎంపీగా ఉన్నారు. ఈ ప్రాంతంలో రైతులు, సిక్కుల ఓట్లు చాలా కీలకం.
యూపీ తలరాతను మార్చే ఎన్నికలివి: అఖిలేశ్
ప్రయాగ్రాజ్: ఈ సారి యూపీ ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరుగుతున్నవని.. రాష్ట్ర తలరాతను మార్చేవని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ చెప్పారు. మంగళవారం బిర్పూర్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘బీజేపీ పాలనలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఆ పార్టీ నాయకులు నోరెత్తితే అబద్ధాలే చెబుతారు. ఎస్పీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని తెలిపారు. తాము చేసిన అభివృద్ధి పథకాలకు పేర్లు మార్చి బీజేపీ ప్రభుత్వమే చేసినట్టు సీఎం యోగి చెప్పుకుంటున్నారని విమర్శించారు.
స్వతంత్ర అభ్యర్థులకు గాలం
గోవా అసెంబ్లీ ఫలితాల్లో హంగ్ తప్పదని అంచనాలు
పనాజీ, ఫిబ్రవరి 22: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ తప్పదని సంకేతాలు వెలువడుతుండడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ స్వతంత్ర అభ్యర్థుల్లో గెలిచే అవకాశాలున్న వారిని దువ్వే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 40 స్థానాలుండే గోవా అసెంబ్లీలో ఏ పార్టీకి కనీస మెజారిటీ 21 స్థానాలు దక్కే అవకాశాలు లేవని విశ్లేషకులు అంటున్నారు. ‘అధిక సీట్లు గెలుస్తామనే ధీమా మాకుంది. మా అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఒకవేళ కొన్ని స్థానాలు తగ్గితే స్వతంత్ర అభ్యర్థుల సాయం తీసుకుంటాం’ అని కాంగ్రెస్ గోవా రాష్ట్ర అధ్యక్షుడు గిరీశ్ చోడంకర్ అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేశామనే సంగతి స్వతంత్ర అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. కాగా సీట్ల సంఖ్య తగ్గినా సర్కారు ఏర్పాటు చేసేది తామేనని బీజేపీ నేతలు అంటున్నారు. 2017లో కాంగ్రెస్కు 17, బీజేపీకి 13 స్థానాలు వచ్చినప్పటికీ స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు.