బ్యాంకాక్, డిసెంబర్ 6: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మయన్మార్ పదవీచ్యుత నాయకురాలు ఆంగ్సాన్ సూచీకి అక్కడి సైనిక ప్రభుత్వం నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది. కరోనా ఆంక్షలను ఉల్లంఘించడం, ఉల్లంఘించేలా ప్రజలను ప్రేరేపించిన అభియోగాలపై ఈ శిక్షను ప్రకటించింది. అయితే, ఆమె శిక్షను రెండేండ్లకు తగ్గించినట్టు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ రెండేండ్లు కూడా ఆమె జైలులో ఉండరని పేర్కొన్నది. ప్రస్తుతం ఉన్నట్టే గృహ నిర్బంధంలో ఉంటా రని వెల్లడించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ సూచీ మద్దతుదారులు దేశమంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సూచీ రెండోసారి అధికారం చేపట్టకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 1న సైన్యం కుట్ర పన్నింది. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ప్రభుత్వాన్ని రద్దుచేసి అధికారం చేపట్టింది. సూచీపై పలు కేసులు నమోదు చేసింది. ఈ కేసులన్నింటిలో ఆమె దోషిగా నిర్ధారణ అయితే నూరేండ్లకు పైగా ఆమె జైలులోనే గడపాల్సి ఉంటుందని ఓ న్యాయనిపుణుడు పేర్కొన్నారు.