గోపారా: అది పోలీస్స్టేషన్. కానీ, ఆ పోలీస్స్టేషన్లోని టాయిలెట్స్ పబ్లిక్ టాయిలెట్స్ కంటే అధ్వాన్నంగా తయారయ్యాయి. బాత్రూమ్ లోపల, బాత్రూమ్ బయట వాష్బేసిన్ చుట్టూ ఎక్కడ చూసినా గుట్కా తిని ఉంచిన మరకలే. ఇటీవల ఓ రోజు ఆ పోలీస్స్టేషన్కు వచ్చిన జిల్లా ఎస్పీ.. స్టేషన్లో ఆపరిశుభ్రతను చూసి కంగుతిన్నారు. స్టేషన్ ఇన్చార్జిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఆ స్టేషన్లో గుట్కా అలవాటు ఎవరెవరికి ఉందని ఆరా తీశారు. నలుగురు పోలీసులకు ఆ అలవాటు ఉన్నట్లు గుర్తించి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. స్టేషన్లో గుట్కా ఉమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజాగా మరోసారి జిల్లా ఎస్పీ ఆ స్టేషన్కు వెళ్లారు. అక్కడి టాయిలెట్స్ను తనిఖీ చేసి ఆశ్చర్యపోయారు. వార్నింగ్ ఇచ్చినా పోలీసులలో ఎలాంటి మార్పు కనిపించలేదు. టాయిలెట్స్ పరిసరాల్లో ఎటుచూసినా ఎర్రగా గుట్కా ఉమ్మిన మరకలే. దాంతో ఎస్పీలో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. హెచ్చరించినా తీరు మార్చుకోని నలుగురు పోలీసులకు చీవాట్లు పెట్టారు. అంతేగాక ఆ నలుగురిని పనిష్మెంట్ కింద పోలీస్ లైన్కు ఎటాచ్ చేశారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం షాహ్దోల్ జిల్లాలోని గోపారా పోలీస్స్టేషన్లో ఈ అపరిశుభ్రత తాండవం చేస్తున్నది. జిల్లా ఎస్పీ హెచ్చిరించినా ప్రయోజనం లేకుండా పోయింది. దాంతో ఆగ్రహించిన ఎస్పీ.. ఆ స్టేషన్లో గుట్కా ఉమ్మేసే అలవాటున్న ఎస్ఐ నందకుమార్ కచ్వాహా, అదనపు ఎస్ఐ దినేశ్ ద్వివేది, ఏఎస్ఐ దేవేంద్రసింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్యారేలాల్లను పోలీస్లైన్కు ఎటాచ్ చేశారు.