రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఓ ఆసుపత్రిలో నలుగురికి స్వైన్ఫ్లూ నిర్ధారణ అయ్యింది. బాధితులను రాంచీలోని భగవాన్ మహావీర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో వైపు మరో ఇద్దరు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారని, వారికి సంబంధించిన రిపోర్టులు సోమవారం వస్తాయని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. బొకారో, రాంచీ, గిరిడ్ జిల్లాలకు చెందిన ముగ్గురితో పాటు పశ్చిమ బెంగాల్లోని పురూలియాకు చెందిన 70 సంవత్సరాల వృద్ధుడికి హెచ్1ఎన్1 ఫ్లూ నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. బాధితులు మొదట కొవిడ్ పరీక్ష చేయించుకోగా.. నెగెటివ్ తేలింది.
అయితే, వారికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్లు అనుమానం రావడంతో పరీక్షలు చేయగా.. స్వైన్ ఫ్లూగా తేలిందని హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ విజయ్ మిశ్రా పేర్కొన్నారు. రోగులకు ప్రయాణ చరిత్ర లేదని, స్థానికంగానే ఫ్లూ వ్యాప్తి చెందుతోందని తెలుస్తోందన్నారు. మరో ఇద్దరు రోగుల నమూనాలు సోమవారం వస్తాయన్నారు. అయితే, ఆందోళనకర విషయం ఏంటంటే.. పలువురు రోగులు కొవిడ్ లక్షణాలతో ఆసుపత్రికి వస్తున్నారు. టెస్టుల్లో నెగెటివ్గా వచ్చిన సమయంలో తిరిగి ఇండ్లకు పంపిస్తున్నారు. అయితే, కొవిడ్ లక్షణాలు ఉండి.. నెగెటివ్ వచ్చిన వారంతా స్వైన్ ఫ్లూ పరీక్ష పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లేకుంటే మరింత మందికి వైరస్ సోకుతుందని అని విజయ్ మిశ్రా తెలిపారు. మరో వైపు స్వైన్ ఫ్లూ కేసులు నమోదవడంతో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. హైఅలెర్ట్ ప్రకటించారు. ఫ్లూ విస్తరణ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జార్ఖండ్ నేషనల్ హెల్త్ మిషన్ ఎండీ భవనేష్ ప్రతాప్ సింగ్ తెలిపారు.