చెన్నై: పశువుల మేత కోసం నిలువ ఉంచిన గడ్డివాములో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కాలిబూడిదయ్యారు ( Fire accident ). మృతుల్లో భర్త, భార్య వారి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమిళనాడు రాష్ట్రం దిండిగల్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అది ప్రమాదమా, హత్యనా, లేకపోతే ఆత్మహత్యనా అనే వివరాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
దిండిగల్ జిల్లాలోని వట్టకొండన్వలసు గ్రామంలో శనివారం తెల్లవారుజామున గడ్డివాము తగులబడిపోతుండటం చూసి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. మంటలు చల్లారిన తర్వాత ఆ బూడిదలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు పడిఉన్నాయి. అయితే వారికి ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయా..? ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? లేదంటే ఎవరైనా హత్య చేసి తగులబెట్టారా..? అనేది తేలాల్సి ఉంది.
మృతులు మురుగేశన్, అతని భార్య, ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదుచేశామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్పారు.