కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 17 : భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్లోని హజారీభాగ్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖాపియా-బాతుకా అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కోబ్రా-209 బెటాలియన్, జిల్లా పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో రీజినల్ కమిటీ సభ్యుడు సహదేవ్ మెహతో, జోనల్ కమిటీ సభ్యుడు రంజిత్ గంఝు ఉన్నారు.